ప్రజాశక్తి – ఆచంట (పెనుమంట్ర)
ఆలమూరు గ్రామంలో దళితుల శ్మశానవాటికకు స్థలం కేటాయించేందుకు నరసాపురం సబ్కలెక్టర్ హామీ ఇచ్చారని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల విజరుకుమార్ తెలిపారు. ఆలమూరు శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ మూడు రోజులుగా దళితులు పోరాటం చేయడంతో అధికారులు దిగొచ్చారు. శుక్రవారం జాతీయ రహదారిపై బైఠాయించి అర్ధనగ ప్రదర్శన, రాస్తారోకో చేశారు. దీంతో కిలోమీటర్లు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో నరసాపురం సబ్కలెక్టర్ అచ్యుత్ అంబరీష్ ధర్నా శిబిరం వద్దకు చేరుకొని దళితులు, కెవిపిఎస్, మాల మహానాడు నాయకులతో చర్చలు జరిపారు. దళితులకు శ్మశానవాటిక కేటాయిస్తామని రాత పూర్వక హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల విజరుకుమార్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజు మాట్లాడుతూ ఆలమూరులో శ్మశానవాటిక కేటాయించాలని దళితులు అర్ధ నగ ప్రదర్శన చేసిన రోడ్డుపై బైఠాయించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్డిఒ సర్వే చేసి శ్మశానవాటిక కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆర్డిఒ స్వయంగా హామీ ఇవ్వడంతో గ్రామస్తులు తాత్కాలికంగా ధర్నాను విరమించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల నాయకులు పల్లయ్య, బి.మధు సరూప్, అభిషేక్, దళిత సంఘ నాయకులు వెంకటేశ్వర్లు, బుజ్జిబాబు పాల్గొన్నారు.