పార్లమెంటు సమావేశాల ప్రారంభ ఘట్టంలో మోడీ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని ప్రతిపక్షాలు ప్రతికూల వైఖరి అనుసరించతగదని, మరోసారి గెలిచే అవకాశాలు ఎప్పుడూ వుంటాయని మనస్తత్వ పాఠాలు ప్రవచించారు. ప్రతిపక్షాల సవాళ్ల నుంచి ఎప్పుడూ పలాయనం చిత్తగిస్తూ దేశం ముందుకొచ్చిన సవాళ్లకు సమాధానం ఇవ్వకుండా ఏకపక్ష ఆధిక్యతతో పార్లమెంటు పని తీరును ప్రహసనంగా మార్చిన ఘనత నిజానికి ఆయనదే. ఇప్పుడు ఇది మరింత ముదురుతుందని తాజా సంకేతాలు చెబుతూనే వున్నాయి.
ఈ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్, బిజెపిల మధ్య 1997, 2003, 2018 ఎన్నికలలో శాసనసభ, లోక్సభ ఫలితాలు తారుమారైనాయి. ఇప్పుడు ఓట్ల సంఖ్య కూడా బిజెపి కూటమి కన్నా ‘ఇండియా’లో భాగస్వాములైన వారికే ఎక్కువ అని లెక్కలు చెబుతున్నారు. 12.29 కోట్ల ఓట్లు పోలవగా బిజెపి కూటమికి 4.82 కోట్ల ఓట్లు, కాంగ్రెస్కు 4.92 కోట్ల ఓట్లు, ‘ఇండియా’లో భాగస్వాములైన వాటికి మొత్తంగా 5.06 కోట్ల ఓట్లు వచ్చాయి. వీటి ఆధారంగా నిపుణులు ఏవో లెక్కలు కడుతున్నారు గానీ నిజంగా జరగాల్సింది కాంగ్రెస్ ధోరణిలో మార్పు. ‘ఇండియా’ వేదికను సక్రమంగా నిర్వహించడం. రాజకీయంగా సైద్ధాంతికంగానే గాక ఓట్ల చీలిక నివారించేందుకు కృషి చేస్తే వచ్చే లోక్సభ ఎన్నికల పోరాటం సరైన ఫలితాలిస్తుంది.
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను దేశ ప్రజలూ పార్టీలూ మీడియా ఇంకా మాట్లాడుకుంటుండగానే ప్రధాని మోడీ కేంద్రంలో హ్యాట్రిక్ నినాదం మీడియాలో తీసుకురావడం యాదృచ్ఛికమేమీ కాదు. తెలంగాణను మినహాయించితే మూడు కీలక హిందీ రాష్ట్రాల గెలుపుతో మరోసారి తన సంఖ్య పెంచుకున్న కాషాయ పార్టీ నుంచి ఈ దూకుడు ఊహించిందే. బిజెపి రాజకీయ వ్యూహాలు, ప్రతిపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేసి ప్రజల ముందు తనే బాహుబలిగా ప్రత్యక్షం కావాలనే మోడీ రాజకీయం గత పదిపదిహేనేళ్లుగా దేశం చూస్తూనే వుంది. అన్ని విధాల వంత పాడే బడా మీడియా, అధికార రాజకీయాలలో మునిగితేలుతూ బిజెపి హైపర్ హిందూత్వ దాడి నుంచి దృష్టి మరల్చే జాతీయ ప్రాంతీయ లౌకిక పార్టీల పోకడలూ ఇందుకు తోడవుతుంటాయి. గెలుపు ముందు ఓటమి ఎప్పుడూ వెలవెలబోతుందన్నట్టు విజయం విశ్వరూపంలో కనిపిస్తుంటే పరాజితులను పరాభవించడం పరిపాటి. బహుశా ఈ సన్నివేశంలో ఈ లక్షణం మరింతగా ఆవిష్కృతమవుతున్నది. పార్లమెంటు సమావేశాల ప్రారంభ ఘట్టంలో మోడీ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని ప్రతిపక్షాలు ప్రతికూల వైఖరి అనుసరించతగదని, మరోసారి గెలిచే అవకాశాలు ఎప్పుడూ వుంటాయని మనస్తత్వ పాఠాలు ప్రవచించారు. ప్రతిపక్షాల సవాళ్ల నుంచి ఎప్పుడూ పలాయనం చిత్తగిస్తూ దేశం ముందుకొచ్చిన సవాళ్లకు సమాధానమివ్వకుండా ఏకపక్ష ఆధిక్యతతో పార్లమెంటు పని తీరును ప్రహసనంగా మార్చిన ఘనత నిజానికి ఆయనదే. ఇప్పుడు ఇది మరింత ముదురుతుందని తాజా సంకేతాలు చెబుతూనే వున్నాయి. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత తొలి సమావేశాలలోనే ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదింపచేసు కున్న ఈ ప్రభుత్వం ఈ ముగింపు దశలో అక్కడ రిజర్వేషన్లనీ ఆక్రమిత కాశ్మీర్కూ సీట్లు అట్టిపెట్టడం, విముక్తి చేయడమనీ కొత్త నినాదం తీసుకొస్తున్నది. ఇవన్నీ వచ్చే ఎన్నికలకు సన్నాహాలే. అయోధ్యలో ఆలయ ప్రతిష్టాపన, నెహ్రూ తప్పిదా లంటూ దాడి, చరిత్ర పుస్తకాలను మరింత తలకిందులు చేయడం ఇవన్నీ దాని కొనసాగింపే. రాబోయే కాలానికి సంబంధించిన రాజకీయ హెచ్చరికలే ఇవి. ఇదే శీర్షికలో ‘ఇండియా’ వేదిక, కాంగ్రెస్ పోకడలు పేరిట (నవంబర్ 5న) ప్రచురితమైన వ్యాసం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ పరిస్థితికి కారణాలు కనిపిస్తాయి. వివిధ ప్రాంతీయ లౌకిక పార్టీలకూ ఆ వ్యాఖ్యలు వర్తిస్తాయి. మోడీత్వ విజృంభించే తరుణంలో ప్రజల తీర్పు పాఠాలను వంటపట్టించుకోవడమే ఇప్పుడు తక్షణ కర్తవ్యం. 119 స్థానాలు గల శాసనసభలో 65 (సిపిఐ1) సీట్లు గెలిచి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి నాయకత్వమంతా తరలి రావడం మినహా ఫలితాలపై బిజెపి దూకుడు ఇలా వుంటే కాంగ్రెస్ ఇంతవరకూ సమగ్రమైన వ్యాఖ్యలు కూడా చేయలేదు.
బిఆర్ఎస్కు గుణపాఠం, రేవంత్కు సారథ్యం
తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందనేది ముందుగా అత్యధిక సర్వేలు, వాటికి తారాస్థాయిగా ఎగ్జిట్ పోల్స్ ముందే ఊహించాయి. వాటిని ఏ మేరకు విశ్వసించవచ్చుననేది కూడా ఇక్కడ చర్చించాము. తెలంగాణలో కాస్త అటూఇటూగా నిజమైన ఈ పోల్స్ ఎం.పి, రాజస్థాన్లలో విఫలమైనాయి. తెలంగాణపై ఖచ్చితంగా చెప్పిన ‘ఇండియా టుడే’ కూడా అక్కడ దెబ్బతిన్నది. ఆ సంగతి అలా వుంచితే తెలంగాణలో కెసిఆర్ ఏకపక్ష పోకడల పట్ల, ప్రభుత్వ తప్పుల పట్ల ఓటర్ల ఆగ్రహం తీవ్రంగానే వుందని ఫలితాలు తేటతెల్లం చేశాయి. ఆఖరుకు ఆయన, రేవంత్రెడ్డి కూడా ఒక స్థానంలో ఓడిపోయారు. తెలంగాణ సాధించిన నేతగా కెసిఆర్ వీటన్నిటినీ అధిగమిస్తారనే బిఆర్ఎస్ ఆశలు ఆచరణలో కుప్పకూలాయి. సెంటిమెంటు, సంక్షేమ పథకాల ప్రభావం పల్లెల్లో అధికంగా వుంటుందనే అంచనాలు కూడా తలకిందులైనాయి. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డిలో కాంగ్రెస్ సీట్లు తెచ్చుకోలేక పోయింది. ఉత్తర తెలంగాణలో అధికంగానూ, దక్షిణ భాగంలో పూర్తిగానూ దాని విజయాలు లభించాయి. ఉత్తర భాగంలో బిజెపి కూడా మంచి ఫలితాలే సాధించింది. వాస్తవానికి బిజెపితో బిఆర్ఎస్ రాజీ పడటం, ఉభయులూ కలసి కాంగ్రెస్ను రాకుండా చేయడం కోసం వారి మధ్య తెర వెనక దోస్తీ వుందనే బలమైన అభిప్రాయం తీర్పును చాలావరకూ ప్రభావితం చేసింది. మునుగోడులో వామపక్షాల మద్దతుతో బిజెపిని ఓడించిన తర్వాత తెలంగాణ రాజకీయ దృశ్యం మారింది, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మోడీపై తీవ్ర విమర్శలే కురిపించారు. టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మార్చి జాతీయ పాత్ర నిర్వహిస్తామన్నారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్, బిజెపిల మధ్య సమ దూరం సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. మహారాష్ట్రలో రాజకీయ హడావుడి చేశారు (గత ఎన్నికల తరుణంలోనూ ‘దేశ్ కీ నేతా’ నినాదంతోనే ఓటర్ల ముందుకు వెళ్లారని గుర్తుంచుకోవాలి.). కానీ ఇవన్నీ ఒక్కసారిగా ఆపేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై దర్యాప్తు, నోటీసుల తర్వాత కెసిఆర్ వెనక్కు తగ్గారనే భావం బలంగా వ్యాపించింది. కమ్యూనిస్టులతో పొత్తు వుంటుందనే సూచనను మొదట ఇచ్చిన ఆయన తర్వాత తనే వాటిని ఏకపక్షంగా వమ్ముచేయడానికి కూడా ఇదే కారణమైందని అభిప్రాయమేర్పడింది. కాంగ్రెస్, బిఆర్ఎస్ కూడా బిజెపి మత రాజకీయాలు, కేంద్రీకృత పెత్తనంపై పోరాటం కంటే రాష్ట్రాధిపత్యం కోసం తమలో తమ పోటీనే ముందుకు తెచ్చారు. బిజెపి ఇక్కడ శక్తి కాదనే వాదన చేశారు. అవతలి వారే బిజెపితో కలసిపోయారని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఎబివిపి నేపథ్యం గురించి బిఆర్ఎస్ చెప్పింది. కవితను అరెస్టు చేయకపోవడం, మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుపై కేంద్ర దర్యాప్తు జరిపించకపోవడం, సిబిఐ దాడులు లేకపోవడం కుమ్మక్కు వల్లనేనని కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర నాయకులు విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్ మిగిలినచోట్ల వలెనే వామపక్షాల విషయంలో అవాస్తవిక వైఖరి అనుసరించింది. ఇవన్నీ ఫలితాలలో ప్రతిబింబించాయి. సిపిఐ ఒక్క స్థానంతో సర్దుబాటు చేసుకుని విజయం సాధించింది (గత రెండు ఎన్నికల్లో కూడా సిపిఐ కాంగ్రెస్ కలిసే పోటీ చేశాయి). ఆహ్వానం వస్తే మంత్రివర్గంలో చేరే విషయం పరిశీలిస్తామని సానుకూల సూచనలు ఇచ్చింది కానీ ఇప్పటికైతే ఆ దిశలో అడుగులు పడలేదు. సిపిఎం స్వంతంగా పోటీ చేసింది. సిపిఐకి మద్దతునిచ్చింది. అది ఎక్కడా విజయం సాధించకపోవడం, ఓట్లు బాగా తక్కువగా రావడం ఉద్యమాభిమానులకు నిరుత్సాహం కలిగించింది. వీటిపై సమీక్ష చేసుకుంటామని, ఎప్పటిలాగానే ప్రజల కోసం పోరాడతామనీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. కొత్త ప్రభుత్వాన్ని స్వాగతిస్తూనే ప్రజల తీర్పును సరిగ్గా అర్థం చేసుకుని సరైన పాలన అందించాలని సూచించారు. ఈ సందర్భంలో రాజకీయ నేపథ్యాన్ని వందల కోట్లతో నడిచిన ఎన్నికల రాజకీయాన్ని విస్మరించి కమ్యూనిస్టులను చులకన చేస్తూ మాట్లాడటం దారి తప్పిస్తుంది, బిజెపి కూడా 13.9 శాతం ఓట్లు, 8 సీట్లు పొంది ఒక శక్తిగా వచ్చింది. నిజానికి 2019 పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ఇది కొంచెం తక్కువ కాగా గత అసెంబ్లీ ఎన్నికల కంటే బాగా ఎక్కువ. ఈ దఫా కాంగ్రెస్ బిఆర్ఎస్ ల మధ్య ఓట్ల తేడా రెండు శాతం లోపు వచ్చింది. మజ్లిస్ తన 7 స్థానాలు నిలబెట్టుకుంది. ఇరు పక్షాల మధ్య తేడా తొమ్మిదే గనక ఆరు నెలల్లో అంతా మారిపోతుందనే ప్రచారం వివిధ రూపాల్లో సాగుతూనే వుంది. విజయానికి నాయకత్వం వహించిన రేవంత్రెడ్డి సహజంగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా అంతర్గత ఐక్యత, శాసనసభలో సవాళ్లు తీవ్రంగానే వుంటాయనడం నిస్సందేహం. మూడు మాసాల్లో వచ్చే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాతనే రాజకీయ పరిస్థితి ఒక కొలిక్కి వస్తుందని విస్త్రుత చర్చ జరుగుతున్నది. ఫిరాయింపులతో కెసిఆర్ బలం విపరీతంగా పెంచుకున్న గత పద్ధతులు పునరావృతం కాబోవని, కాంగ్రెస్ నాయకులు బాధ్యతగా వ్యవహరించి ప్రజల తీర్పును సార్థకం చేసుకుంటారని ఆశించాలి. అయితే కొంతమంది ఈ కారణంగా చులకన చేస్తూ మాట్లాడటం, రేవంత్ ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోతుందని బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్ బెదిరించడం మాత్రం దారుణం, అప్రజాస్వామికం. తీర్పును స్వాగతిస్తామని బిఆర్ఎస్ చెబుతు న్నా అటూ ఇటూ అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. రేవంత్ విజయం వెనక తెలుగుదేశం ప్రధానంగా వుందని ఒక ప్రచారం జరిగినా తమకేమీ సంబంధం లేదని ప్రకటించింది. టిడిపి మిత్రపక్షం, ఎన్డిఎ భాగస్వామి జనసేన బిజెపితో కలిసి ఎనిమిది చోట్ల పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయింది. అక్కడ టిడిపి ఇక్కడ బిజెపి అనే ప్రశ్న ఒకటి రాగా టిడిపి వరకూ కాంగ్రెస్తో తాము లేమన్న సందేశం బిజెపికి చేర్చడానికి జాగ్రత్త పడుతున్నది. ఈ ఎన్నికల ఫలితాలపై రాజకీయ పరిణామాలపై మరింత వివరమైన చర్చ ముందు ముందు తప్పక జరపాల్సి వుంటుంది.
కాంగ్రెస్కు ఎదురు దెబ్బ
ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలోనూ కొత్త ప్రాంతీయ పార్టీ జెడ్పిఎం అధికారం చేపట్టింది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి లాల్ దుహోమా ఏ కూటమిలోనూ చేరే యోచనలో లేరు. ఇక రాజస్థాన్ చేజారుతుందనుకున్నా మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లో కాంగ్రెస్ అంచనాలు తలకిందులైనాయి. బిజెపియే ఊహించినదానికన్నా ఎక్కువ విజయం సాధించింది. ఇందుకు దారితీసిన రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ ఒంటెత్తు పోకడల గురించి ‘పీపుల్స్ డెమోక్రసీ’ తాజా సంపాదకీయం సమగ్రంగానే విశ్లేషించింది, హెచ్చరిస్తున్నది కూడా. అయితే చత్తీస్గఢ్, ఎం.పి లలో తమ వాళ్ల మధ్య తగాదాల గురించి, నాయకుల తేడాల గురించి మాత్రమే కాంగ్రెస్ చర్చ ఎక్కువగా నడుస్తున్నది. రాజస్థాన్లో ఓటమి రావచ్చని భావించినా తీవ్రత చాలా ఎక్కువగా వుంది. 17 మంది మంత్రులు ఓడిపోయారు. మధ్యప్రదేశ్లో ఫిరాయింపులతో తిరిగొచ్చిన బిజెపి ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ హిందూత్వ రాజకీయాలనూ కొన్ని పథకాలను ఆధారం చేసుకుని గెలుపొందారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కూడా బిజెపి నమూనాను అనుకరించబోయి రెండు విధాల భంగపడ్డారు. చత్తీస్గఢ్ మాత్రం గెలుస్తామనుకుని దారుణ ఓటమి పాలైంది కాంగ్రెస్. ఈ రెండు రాష్ట్రాలలోనూ ఆదివాసీ ప్రాంతాలలో ఎస్టి సీట్లలో బిజెపి చాలా పట్టు సాధించడం ప్రత్యేకించి ఆందోళనకరం. ఈ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్, బిజెపిల మధ్య 1997, 2003, 2018 ఎన్నికలలో శాసనసభ, లోక్సభ ఫలితాలు తారుమారైనాయి. ఇప్పుడు ఓట్ల సంఖ్య కూడా బిజెపి కూటమి కన్నా ‘ఇండియా’లో భాగస్వాములైన వారికే ఎక్కువ అని లెక్కలు చెబుతున్నారు. 12.29 కోట్ల ఓట్లు పోలవగా బిజెపి కూటమికి 4.82 కోట్ల ఓట్లు, కాంగ్రెస్కు 4.92 కోట్ల ఓట్లు, ‘ఇండియా’లో భాగస్వాములైన వాటికి మొత్తంగా 5.06 కోట్ల ఓట్లు వచ్చాయి. వీటి ఆధారంగా నిపుణులు ఏవో లెక్కలు కడుతున్నారు గానీ నిజంగా జరగాల్సింది కాంగ్రెస్ ధోరణిలో మార్పు. ‘ఇండియా’ వేదికను సక్రమంగా నిర్వహించడం. రాజకీయంగా సైద్ధాంతికంగానే గాక ఓట్ల చీలిక నివారించేందుకు కృషి చేస్తే వచ్చే లోక్సభ ఎన్నికల పోరాటం సరైన ఫలితాలిస్తుంది.
![తెలకపల్లి రవి](https://prajasakti.com/wp-content/uploads/2023/12/telakapalli-ravi.jpg)