అకాల వర్షాలు, వరదల కారణంగా గత కొన్నిరోజుల నుంచి తమిళనాడు దక్షిణ జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తూత్తుకుడి, నెల్లైలోని లోతట్టు ప్రదేశాల్లో జరుగుతున్న సహాయక చర్యల్లో ఇటీవల తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ పాల్గొన్నారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. తన బృందంతో కలసి బాధితులకు చేయూతనందించారు. దీనిని పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. మంత్రితో కలిసి ఆయన ఎందుకు సహాయక చర్యల్లో పాల్గన్నారంటూ విమర్శలు చేశారు. కాగా, ఈ విషయంపై తమిళ హాస్య నటుడు వడివేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సహాయక చర్యల్లో మారి సెల్వరాజ్ ఎందుకు పాల్గన్నాడని చాలామంది ప్రశ్నిస్తున్నారు. తూత్తుకుడి ఆయన సొంతూరు. ఆ ప్రాంతంలో ఎక్కడ ఏముందనే విషయం ఆయనకు బాగా తెలుసు. ఆయన ఏమైనా అమెరికా నుంచి వచ్చారా? ఒకవేళ నా సొంతూరులో వరదలు వస్తే నేను కాకుండా ఇంకెవరు వెళ్తారు?’ అని ప్రశ్నించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/12-13.jpg)