జపాన్‌లో భూకంపం : రాజమౌళి కుటుంబానికి తప్పిన పెను ప్రమాదం

Mar 21,2024 11:38 #Earthquake, #Japan, #rajamouli

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుటుంబం జపాన్‌ భూకంప ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. జపాన్‌ పర్యటనలో ఉన్న తాము భూప్రకంపనలకు హడలిపోయామని జక్కన్న కుమారుడు కార్తికేయ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కార్తికేయ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘మేం 28వ అంతస్తులో ఉన్నాం. బిల్డింగ్‌ నెమ్మదిగా కదలడం ప్రారంభమైంది. అది భూకంపం అని గ్రహించడానికి మాకు కొంత సమయం పట్టింది. ఈ భూకంప ధాటికి నేనెంతో భయపడ్డా. కానీ మా చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందలేదు. వారు అక్కడ వర్షం పడుతున్నంత ఈజీగా లైట్‌గా తీసుకున్నారు. మొత్తానికి మేం భూకంపాన్ని ఎక్స్‌పీరియెన్స్‌ చేశాం’ అని కార్తికేయ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టుతోపాటు భూకంపానికి సంబంధించి తన స్మార్ట్‌ వాచ్‌లో వచ్చిన వార్నింగ్‌ని కూడా ఓ ఫొటో తీసి దాన్ని ట్వీట్‌కు జత చేశారు. ఈ ట్వీట్‌తో జక్కన్న అభిమానులందరూ ఫ్యామిలీ సేఫ్‌గా ఇండియాకు రావాలని కోరుకుంటున్నారు.

కాగా, రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ జపాన్‌ థియేటర్లలో ఇప్పటికీ ప్రదర్శితమౌతుంది. దీంతో జక్కన్న ఫ్యామిలీ జపాన్‌ పర్యటనకు వెళ్లారు. అయితే కొద్దిరోజుల క్రితమే జపాన్‌లో భూకంపం సంభవించింది. తూర్పు జపాన్‌లోని దక్షిణ ఇబారకి ప్రిఫెక్చర్‌లో 46 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 5.3గా నమోదైందని అమెరికా జియోలాజికల్‌ సర్వే ఓ ప్రకటనలో వెల్లడించింది.

➡️