పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను కల్పిస్తుంది. నెలకు లక్ష రూపాయల జీతం వస్తుంది. రవాణా ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుంది. ఏడాదిలో 34 సార్లు ఎంపీతో పాటు ఆయన భార్యకు ఉచిత విమాన ప్రయాణం. ఫస్ట్క్లాస్ ఏసీ కోచ్లో రైలు ప్రయాణం ఉచితం. రోడ్డు రవాణా అయితే కి.మీ.కి రూ.16 చొప్పున బిల్లు చెల్లిస్తారు. నియోజకవర్గ కార్యాలయ నిర్వహణ ఖర్చు నెలకు రూ.45 వేలు, పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటే రోజుకు రూ.2 వేలు అదనంగా చెల్లిస్తారు. ఫర్నీచర్, ఎలక్టాన్రిక్ వస్తువులు, ఇతర అవసరాల నిమిత్తం ప్రతి మూడు నెలలకు రూ.75 వేలు అందిస్తారు. అత్యాధునిక వైద్య సదుపాయాలను ఉచితంగా కల్పిస్తారు. పాథాలాజికల్ లాబొరేటరీ సౌకర్యం, ఈసీజీ, దంత, కంటి, చర్మ ఆరోగ్య సేవలు ఉచితంగా లభిస్తాయి. ఎంపిగా ఉన్నంత కాలం డిల్లీలో నివాస వసతిని కల్సిస్తారు. తొలిసారి గెలిచిన వారికి రాష్ట్ర ప్రభుత్వ వసతి గహాలను కేటాయిస్తారు. 50 వేల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు వాడుకోవచ్చు. మూడు టెలిఫోన్లను కేటాయిస్తారు. వాటిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదిలో 50 వేల ఉచిత కాల్స్, స్మార్ట్ ఫోన్ ద్వారా 3జీ ప్యాకేజీలో అదనంగా 1.50 లక్షల కాల్స్ మాట్లాడుకునే వీలుంటుంది. రిటైరైతే నెలకు రూ.50 వేల పింఛన్ వస్తుంది.