గన్నవరం (విజయవాడ) : విజయవాడ నుండి ముంబైకి ఫ్లైట్ లో వెళ్లాలనుకునేవారికి తాజాగా… ఎయిర్ ఇండియా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. బెజవాడ నుంచి దేశ వాణిజ్య రాజధాని ముంబైకి మరికొద్ది రోజుల్లో డైలీ విమాన సర్వీసు ప్రారంభం కాబోతోంది. జూన్ 15న ఎయిర్ ఇండియా సంస్థ 180 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉన్న భారీ బోయింగ్ ఏ320 విమాన సర్వీసును ప్రారంభించనుంది. ప్రారంభ ఆఫర్గా టికెట్ ధరను రూ.5600గా నిర్ణయించారు. ఈ ధర మారే అవకాశం కూడా ఉంది. ప్రతి రోజూ రాత్రి 7.10 గంటలకు విజయవాడ నుంచి విమానం బయలుదేరి రాత్రి 9 గంటల కల్లా (గంటా యాభై నిమిషాలు) ముంబైకి చేరుతుంది. చాలా కాలంగా విజయవాడ నుంచి ముంబైకి రెగ్యులర్ విమాన సర్వీసు కావాలని పలు వినతులు వచ్చాయి. దీనికి సంబంధించి రాజకీయ నేతలు కూడా కేంద్రానికి లేఖలు రాశారు. ఆక్యుపెన్సీ పైన విమానయాన సంస్థలు ఆరా తీశాయి. తాజాగా ఎయిర్ ఇండియా ఈ కీలక నిర్ణయం ప్రకటించింది.
విజయవాడ నుంచి ముంబైకి విమాన సర్వీసు కావాలని నగరంలో వ్యాపారుల నుంచి ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఉంది. దీన్ని ఎయిర్పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి విమానయాన సంస్థల దృష్టికి తీసుకెళ్లగా ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ వెంటనే స్పందించింది. ప్రారంభ ఆఫర్గా కేవలం రూ.5600లకే ముంబైకి ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. సాధారణ ధరలతో పోల్చుకుంటే రూ.4600 ఆఫర్ ఇచ్చింది. గన్నవరం నుంచి పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ ఇండియా విమానం కు వచ్చే స్పందన చూసిన తరువాత ఇతర విమాన యాన సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.