న్యూఢిల్లీ : భారత్ ఉపగ్రహం జిశాట్ -20ని స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయోగించేందుకు సిద్దమైంది. తరువాతి తరానికి సంబంధించిన భారీ కమ్యూనికేషన్స్ శాటిలైట్ జిశాట్ -20ని ప్రయోగించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లు మొదటిసారిగా ఫాల్కన్ -9 రాకెట్ను వినియోగించనుంది. భారత్ ప్రత్యేక మిషన్లో భాగంగా ఫ్లోరిడా నుండి ఈ ప్రయోగం చేపట్టనుంది.జిశాట్ -20 శాటిలైట్ బరువు 4,700కేజీలు. హెచ్టిఎస్ సామర్థ్యం సుమారు 48 జిపిబిఎస్గా ఉంటుంది. రిమోట్/అనుసంధానం కాని ప్రాంతాలకు సేవలను అందించేందుకుగాను ప్రత్యేకంగా ఈ శాటిలైట్ను రూపొందించారు. సమయానికి మరే రాకెట్ స్పేస్ అందుబాటులో లేనందున స్పేస్ ఎక్స్తో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్నాథ్ తెలిపారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో రాకెట్ ప్రయోగం కోసం ఇస్రో వాణిజ్య విభాగం ‘ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ‘ (ఎన్ఎస్ఐఎల్) స్పేస్ ఎక్స్తో ఓ ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకు భారీ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు భారత్ ఫ్రాన్స్కి చెందిన ఏరియన్ స్పేస్ కన్సార్టియంపై ఆధారపడింది.