ఎన్నికల పోకడలను అధ్యయనం చేసే సెఫాలజిస్ట్ ప్రాబల్యం భారతదేశంలో 2014 నుండి పెరిగిపోయింది. ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. కుక్క తోక ఆడించడం సహజం కానీ ఇప్పుడు తోకే కుక్కనాడిస్తుంది. ప్రధాన పార్టీలు వాటి ఊబిలో చిక్కుకొని వారు సూచించిన ఎటువంటి పనైనా చేయడానికి వెనుకాడడం లేదు. డబ్బు ఎంత ఖర్చయినా పర్వాలేదు, పార్టీ ఏదైనా పర్వాలేదు, గెలుపే ప్రధానంగా ఎన్నికల్లో పాల్గొనాలనే లక్ష్యంగా ప్ర్రధాన పార్టీల అభ్యర్ధులు రంగంలోకి దిగుతున్నారు. ప్రజలకు మేలు చేసే అంశాల పట్ల ఫోకస్ ఉండట్లేదు.. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం, రవాణా రంగం మార్కెట్ రంగం ఛిద్రం చేయడం, ఎవరికీ ఉపయోగపడని ఆత్మ నిర్భర్ భారత్, గరీబ్ కళ్యాణ్ యోజన, సంచయని యోజన లాంటి పథకాల పట్ల, సమాన విద్యావకాశాలు లేని నూతన విద్య విధానం పట్ల, కరువు, ఉపాధి వంటి విషయాలను పాలకులు పట్టించుకోవడం లేదు. కేవలం గెలుపు గుర్రాలను గుర్తించడం, డబ్బు ఎలా ఖర్చు పెట్టడం, అపాత్ర దానాలకు ఎలా శ్రీకారం చుట్టి ప్రజలను ప్రభావితం చేయడమే ఈ సెఫాలజిస్టుల పని. ముఖ్యమంత్రులను దేశాధిపతులను, పాలనలో నిర్ణయాధికార పాత్రను ఎవరు పోషించాలని సెఫాలజిస్టులు సూచిస్తున్నారంటే పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థమవుతోంది. దొంగ సర్వేలు, సెఫాలజిస్టుల మోసపూరిత ప్రకటనలు నమ్మి ఓటేస్తే జీవితాలను అంధకారంలోకి నెట్టినట్టే.
-డాక్టర్ ఎం సురేష్ బాబు