వామ్మో..అంత ఖర్చా..! 

Mar 28,2024 08:30 #Election Campaign, #Expenditure
  • ఎన్నికల ఖర్చుపై అభ్యర్థుల్లో ఆందోళన 
  • రోజుకు ప్రచార ఖర్చు రూ.ఆరు లక్షలకు పైనేనంటూ గుబులు 
  • ప్రచారానికే దాదాపు రూ.నాలుగు కోట్లు అంటూ లెక్కలు 
  • గత ఎన్నికల కంటే రూ.10 కోట్లు అదనపు ఖర్చంటూ ఆవేదన

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : ఎన్నికల ఖర్చుపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పోలింగ్‌కు సమయం ఎక్కువగా ఉండటంతో ఎన్నికల ప్రచారానికే భారీగా ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో ఖర్చును ఎలా తగ్గించుకోవాలో తెలీక అభ్యర్థులంతా తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. నాలుగో విడతలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 18న విడుదల కానుంది. మే 13న పోలింగ్‌ జరగనుంది. గతంలో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు తొలి విడతలోనే జరిగేవి. మార్చి పదో తేదీకి అటుఇటుగా షెడ్యూల్‌ విడుదలవ్వగా ఏప్రిల్‌ 16వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ ముగిసేది. గత ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు నెల రోజులు ఎన్నికల ప్రక్రియ వెనక్కి వెళ్లింది. చాలామంది అభ్యర్థులు ఎన్నికల షెడ్యూల్‌ రాకుండానే ప్రచారం ప్రారంభించారు. షెడ్యూల్‌ వచ్చిన తర్వాత రెండు నెలల వ్యవధి రావడంతో భారీగా ఖర్చయ్యే పరిస్థితి ఏర్పడటంతో అంతా విలవిల్లాడుతున్నారు. పశ్చిమగోదావరిలో 14 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అభ్యర్థులంతా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తక్కువగా లెక్కించినా ప్రచార ఖర్చు రోజుకు రూ.ఐదు నుంచి రూ.ఆరు లక్షలు వరకూ అవుతున్నట్లు అభ్యర్థులు లెక్కలు చెబుతున్నారు. భోజనాలు, మద్యం, డీజిల్‌ ఇతర ఖర్చులు భారీగా అవుతున్నట్లు చెబుతున్నారు. షెడ్యూల్‌ విడుదలైన తర్వాత పోలింగ్‌ సమయానికి దాదాపు రెండు నెలలు వ్యవధి రావడంతో ప్రచార ఖర్చు నిమిత్తమే దాదాపు రూ.నాలుగు కోట్లు కానున్నట్లు అభ్యర్థులు మదనపడుతున్నారు. గత ఎన్నికల కంటే ప్రచార ఖర్చు నిమిత్తమే రూ.రెండు కోట్లుపైనే అదనంగా వెచ్చించాల్సి వస్తుందని నలిగిపోతున్నారు. ఈ ఖర్చు కాకుండా ఎన్నికల ముందు నగదు పంపిణీ, తాయిలాలకు అయ్యే ఖర్చుపై లెక్కలు వేసుకుంటూ అభ్యర్థులు అదిరిపడుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ ఓటర్లున్నారు. ఓటుకు రూ.వెయ్యి పంపిణీ చేస్తే రూ.20 కోట్లు, రూ.రెండు వేలు పంపిణీ చేస్తే రూ.40 కోట్లు అవుతుందని, తక్కువగా లెక్కించినా ప్రధాన పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు రూ.50 కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని గుబులు చెందుతున్నారు. టికెట్‌ రాకపోతే ఒక బాధ, వస్తే ఇంకోబాధ అంటూ అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు గురువుతున్నారు. ఖర్చును తగ్గించుకునేందుకు పలువురు అభ్యర్థులు ప్రచార షెడ్యూల్‌లో విరామం ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. ఇతర పనుల పేరుతో ప్రచారానికి బ్రేక్‌ ఇస్తూ ఖర్చు తగ్గించుకునే ప్రణాళికతో ముందుకెళ్తున్నారని స్పష్టమవుతోంది.

అసంతృప్తులను బుజ్జగించేందుకు నజరానాలు..!

టిడిపి, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచాయి. దీంతో అత్యధిక నియోజకవర్గాల్లో టికెట్‌ ఆశించి భంగపడిన అభ్యర్థులతోపాటు ముఖ్యమైన నాయకులు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో టికెట్‌ వచ్చిన అభ్యర్థులు ఆయా పార్టీల్లోని అభ్యర్థులను, కేడర్‌ను కలుపుకుని ముందుకెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. గతంలో టికెట్‌ ఆశించిన అభ్యర్థికి, ఇతర నాయకులకు సైతం భారీగా నజరానా ముట్టచెెబితే తప్ప వెనక్కి తగ్గడం లేదని సమాచారం. దీంతో టిడిపి, జనసేనలోని అభ్యర్థులకు ఈ ఖర్చు మరింత అదనపు భారంగా మారినట్లు చర్చ నడుస్తోంది.

➡️