ఐదేళ్లలో 200 మందికిపైగా మావోయిస్టులు

Apr 4,2024 07:06 #BJP Govt, #Deaths, #encounter

ప్రజాశక్తి – యంత్రాంగం : బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టుల్ని హతమార్చడంలో ప్రత్యేక దృష్టి సారించింది. కేవలం గడిచిన ఐదేళ్ల కాలంలో ఎన్‌కౌంటర్ల పేరుతో 200 మందికి పైగా మావోయిస్టుల్ని హతమార్చింది. 2019 నుంచి 2024 ఏప్రిల్‌ 2 వరకు దేశంలో మావోయిస్టులు 248 మంది మృతి చెందినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. సంవత్సరాల వారీగా చూసుకుంటే.. మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లను పరిశీలిస్తే.. 2019లో (107), 2020లో (109), 2021లో (82), 2022లో (69), 2023లో (69), 2024 (ఏప్రిల్‌ 2 వరకు) 28 సార్లు ఎన్‌కౌంటర్స్‌ జరిగాయి.
గత ఐదేళ్లలో సుమారుగా 240 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. సంవత్సరాల వారీగా చూసుకుంటే.. 2019లో (65), 2020లో (40), 2021లో (51), 2022లో (30), 2023లో (20), 2024 ఏప్రిల్‌ 2 వరకు (42) మంది మృతి చెందారు. 2019వ సంవత్సరంలో 65 మంది మృతి చెందితే.. 2024లో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 42 మంది మావోయిస్టులు మృతి చెందడం గమనార్హం.
గత ఐదేళ్లలో సుమారుగా 1700 మందికిపైగా మావోయిస్టులు అరెస్టయ్యారు. 2019లో (499), 2020లో (438), 2021లో (494), 2022లో (291), 2023లో (428), 2024 (ఏప్రిల్‌ 2 వరకు) 167 మంది అరెస్టయ్యారు. ఇక మావోయిస్టులకు భద్రతా సిబ్బంది జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 140 మంది దాకా భద్రతా సిబ్బంది మృతి చెందారు. 2019లో (21), 2020లో (36), 2021లో (46), 2022లో (10), 2023లో (25), 2024 (ఏప్రిల్‌ 2 వరకు ) 6 గురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మావోయిస్టులకు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన కాల్పుల వల్ల గత ఐదేళ్లలో సుమారుగా 200 మందికి పైగా పౌరులు చనిపోయారు. 2019లో (46), 2020లో (47), 2021లో (33), 2022లో (36), 2023లో (41), 2024 (ఏప్రిల్‌ 2 వరకు ) 17 మంది పౌరులు మృతి చెందారు.

13కు చేరిన మావోయిస్టుల మృతులు
కాగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ కర్చోలి అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య బుధవారానికి 13కు చేరింది. మంగళవారం పది మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మరింత విస్తృతంగా దండకారణ్యంలో గాలించారు. వారికి బుధవారం మరో ముగ్గురి మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు ఎనిమిది గంటలపాటు కాల్పులు జరగడంతో దండకారణ్యంలో యుద్ధవాతావరణం నెలకొంది. డిఆర్‌జి, ఆర్‌పిఎఫ్‌, కోబ్రా బెటాలియన్‌, బస్తర్‌ బెటాలియన్‌ దళాలు కూంబింగ్‌లో పాల్గొన్నట్టు ఐజి పి.సుందర్‌ రాజ్‌ వెల్లడించారు.

➡️