పోలింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు : ఇసి

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్‌ నమోదైన 266 స్థానాలను గుర్తించింది. తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లోనూ జాతీయ సగటు (67.40) కంటే తక్కువ పోలింగ్‌ నమోదైంది. దీంతో ఈసారి అక్కడ ఓట్ల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఇసి ముందడుగు వేస్తోంది. సంబంధిత నియోజకవర్గాల సిబ్బందితో శుక్రవారం ఢిల్లీలో సమావేశమైన ఇసి అధికారులు.. ఓటరు భాగస్వామ్యాన్ని పెంచేందుకు వ్యూహరచన చేశారు. 2019లో తెలంగాణ, బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, జమ్మూ-కశ్మీర్‌, ఝార్ఖండ్‌లలో పోలింగ్‌ శాతం.. జాతీయ సగటు 67.40 శాతంతో పోలిస్తే తక్కువగా నమోదైంది. మొత్తం 266 నియోజకవర్గాల్లో తక్కువ ఓటింగ్‌ నమోదు కాగా.. వాటిలో 215 గ్రామీణ, 51 పట్టణ ప్రాంత స్థానాలు ఉన్నాయి. పోలింగ్‌ శాతం పెంపు విషయంలో దేశంలోని అన్ని ప్రాంతాలకూ ఒకే విధమైన వ్యూహం పనిచేయదని, సంబంధిత నియోజకవర్గాలకు అనుగుణంగా రూపొం దించాలని భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ సూచిం చారు.
ప్రజలే స్వయంగా ముందుకొచ్చి ఎన్నికల ప్రక్రియలో భాగమయ్యే వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని సిఇసి చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సౌకర్యాల కల్పన, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్స్‌, ఇన్‌ఫ్లుయెన్సర్లను భాగస్వామ్యం చేయడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల ఉదాసీనతపై రూపొందించిన ఓ బుక్‌లెట్‌ను కూడా విడుదల చేశారు. లాజిస్టికల్‌ కార్యకలాపాల క్రమబద్ధీకరణ, ఓటర్లలో అవగాహనను పెంచేందుకు ఉద్దేశించిన ‘సిస్టమాటిక్‌ ఓటర్‌ ఎడ్యుకేషన్‌- ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌’ ప్రోగ్రామ్‌ తదితర అంశాలపై చర్చలు జరిపారు.

➡️