కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ

Apr 30,2024 20:42 #Cricket, #Sports, #T20, #World Cup
  • టి20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన బిసిసిఐ

ముంబయి: వెస్టిండీస్‌-అమెరికా వేదికగా జూన్‌లో జరగనున్న ఐసిసి టి20 ప్రపంచ కప్‌కు భారత జట్టు సిద్ధమైంది. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బిసిసిఐ) 15మంది ఆటగాళ్లతో కూడిన జట్టుతోపాటు మరో ముగ్గురిని రిజర్వుగా ఎంపిక చేసింది. బిసిసిఐ మంగళవారం ప్రకటించిన 15మంది ఆటగాళ్ల జాబితాలో యజ్ఞేంద్ర చాహల్‌, సంజు శాంసన్‌, రిషబ్‌ పంత్‌ చోటు దక్కించుకోగా.. మ్యాచ్‌ ఫినిషర్‌ రింకు సింగ్‌ రిజర్వు ఆటగాడిగా ఎంపికయ్యాడు. శివమ్‌ దూబే అనూహ్యంగా తుది 15మంది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకోగా.. శుభ్‌మల్‌ గిల్‌ రిజర్వులోకి వెళ్లిపోయాడు. ఇక కారు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి దాదాపు రెండేళ్ల తర్వాత బ్యాట్‌ పటిన వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు తుది 15మంది ఆటగాళ్లలో చోటు దక్కింది. ఈ సీజన్‌ ఐపిఎల్‌లో ఢిల్లీ తరఫున పంత్‌ 8మ్యాచుల్లో 158.51 స్ట్రయిక్‌రేట్‌తో 251 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇక స్పిన్నర్ల కోటాలో కుల్దీప్‌, చాహల్‌తోపాటు పేసర్ల విభాగంలో బుమ్రా, సిరాజ్‌తోపాటు ఆర్ష్‌దీప్‌కు చోటు దక్కింది. రాజస్తాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంజు శాంసన్‌ దుర్భేధ్యఫామ్‌లో ఉండడంతో అతడు మరోసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. హార్దిక్‌, జడేజా, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌ ఆల్‌రౌండర్‌ కోటాలో ఎంపికయ్యారు.

వీరికి నిరాశ
లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు నిరాశే ఎదురైంది. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా పంత్‌, శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌ పోటీపడ్డా.. వీరంతా మంచిఫామ్‌లో ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై తర్జనభర్జన జరిగింది. చివరకు సెలెక్టర్లు పంత్‌, శాంసన్‌ల వైపు మొగ్గు చూపారు. అలాగే హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మతోపాటు ముకేశ్‌ కుమార్‌లకూ నిరాశే తప్పలేదు. ఇక 150 కి.మీ. కంటే వేగంతో బౌలింగ్‌ చేస్తున్న మయాంక్‌ యాదవ్‌ను ఎంపిక చేస్తారని ఊహాగానాలు వచ్చినా.. సెలెక్షన్‌ కమిటీ అతనివైపు దృష్టి సారించలేదు.
జట్టు : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), పాండ్యా(వైస్‌ కెప్టెన్‌), కోహ్లి, జైస్వాల్‌, సూర్యకుమార్‌, శాంసన్‌, పంత్‌(వికెట్‌ కీపర్లు), జడేజా, దూబే, అక్షర్‌, సిరాజ్‌, బుమ్రా, కుల్దీప్‌, చాహల్‌, ఆర్ష్‌దీప్‌.
రిజర్వు: రింకు సింగ్‌, శుభ్‌మన్‌, ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌.

➡️