ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నిలో భాగంగా ఫైనల్ చేరడం ద్వారా వినేశ్ పారిస్ ఒలింపిక్స్లో భారత్కు కోటాను ఖాయం చేసింది. 50 కేజీల కేటగిరీలో ఆమె అర్హత సాధించింది. శనివారం జరిగిన బౌట్లలో వినేశ్ వరుసగా మిరాన్ చియాన్ (కొరియా), స్మానంగ్ దిట్ (కంబోడియా)లను ఓడించి సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టింది.
సెమీస్లో కజకిస్తాన్కు చెందిన లౌరా గనికిచ్ను ఓడించడంతో ఫైనల్ చేరడంతో పాటు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖాయమైంది. వినేశ్తో పాటు మరో ఇద్దరు భారత రెజ్లర్లు కూడా బెర్త్లు సంపాదించారు. 2021 వరల్డ్ చాంపియన్షిప్ రజత పతక విజేత అన్షు మలిక్ (57 కేజీలు), అండర్-23 వరల్డ్ చాంపియన్ రితిక (76 కేజీలు) కూడా ఫైనల్ చేరడంతో ద్వారా పారిస్కు టికెట్ సాధించారు. దీంతో రెజ్లింగ్ మహిళల విభాగంలో నాలుగు కోటాలు ఖరారయ్యాయి. గత ఏడాదే భారత్నుంచి అంతిమ్ పంఘాల్ (57 కేజీలు) ఒక కోటాను సాధించింది. టోక్యో ఒలింపిక్స్లో కూడా భారత్నుంచి నలుగురు బరిలోకి దిగారు. మరో వైపు పురుషుల విభాగంలో భారత్నుంచి ఇంకా ఒక్క ఒలింపిక్స్ కోటా కూడా ఖాయం కాలేదు.