ప్రజాశక్తి-పాడేరు:మహిళలకు అండగా నిలుస్తూ, వారిని ఆర్ధికంగా చేయూతను ఇచ్చేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. వై.ఎస్.ఆర్.చేయూత నాల్గవ విడత కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పిసినికాడ గ్రామంలో ప్రారంభించారు. జిల్లాలో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమలో భాగంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత, గ్రామీణభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. మురళి, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వైఎస్ఆర్. చేయూత పథకం నాల్గవ విడత కింద 53,735 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.100.75 కోట్లను జమ చేయడం జరుగు తుందన్నారు. మహిళలకు ఇటువంటి కార్యక్రమాలు అమలు చేయడంతో సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ పథకం స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్ధిక పురోగతికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారులకు నమూనా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి వి.మురళి, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.