రైతు ఇంటి ముంగిటకే అన్ని సేవలు

Mar 10,2024 23:55
రైతు ఇంటి ముంగిటకే అన్ని సేవలు

ప్రజాశక్తి-గోపాలపురంగతంలో ఎన్నడూ లేని విధంగా రైతుకు అవసరమైన అన్ని సేవలూ గ్రామంలోని జగనన్న ప్రభుత్వం అందిస్తోందని హోమ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత తెలిపారు. రైతులందరూ సంతోషంగా ఉండాలి, వ్యవసాయం అంటే పండగలా చేసుకోవాలని అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలను జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తుందన్నారు. విత్తనం దగ్గర నుంచి పంట విక్రయం వరకూ అన్ని వేళలా రైతులకు జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో విస్తారంగా పండిన ధాన్యాన్ని మంచి గిట్టుబాటు ధరతో ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. నవరత్నాలలో భాగంగా రైతు భరోసా సాయం కింద దేశంలో ఎక్కడా లేనివిధంగా కౌలు రైతులకు సైతం సంవత్సరానికి రూ.13,500 చొప్పున అందిస్తున్నామన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️