ఖాట్మండు : నేపాల్ ప్రధాని ప్రచండ బుధవారం పార్లమెంట్లో విశ్వాస పరీక్షలో నెగ్గారు. 275సీట్లు కలిగిన పార్లమెంట్లో మూడవ అతిపెద్ద పార్టీగా వున్న నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు సెంటర్)కి చెందిన ప్రచండ విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 157 ఓట్లు రావడంతో ప్రభుత్వం గట్టెక్కింది. నేపాలీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకోవడంతో ప్రచండ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యునిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్)తో తిరిగి పొత్తు పెట్టుకుని కొత్త కేబినెట్ ఏర్పాటు చేశారు. 2022 డిసెంబరులో ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత ప్రచండ పార్లమెంట్ విశ్వాసాన్ని కోరడం ఇది మూడవసారి. పాలక సంకీర్ణానికి మిత్రపక్షం తోడ్పాటును ఉపసంహరించుకున్న పక్షంలో 30రోజుల్లోగా ప్రధాని సభా విశ్వాసాన్ని కోరాల్సి వుంటుంది.