బ్రెసిలీయా : బ్రెజిల్ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలోని రాష్ట్రం రియో గ్రాండే దో సుల్లో గత 80 ఏళ్లల్లో ఎన్నడూ లేనంతగా వరదలు పొంగుతున్నాయి. ఈ వరదల కారణంగా 100 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వరదలు మరింత విజృంభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వరదల కారణంగా బుధవారం నాటికి 372 మంది గాయపడ్డారని, మరో 128 మంది ఆచూకీ తెలియడం లేదని రాష్ట్ర అధికారులు తెలిపారు. వరదలకు సుమారు 10 లక్షల మంది ప్రభావతమయ్యారని చెప్పారు. వరదల ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.