కరాచీ : పాకిస్థాన్లో బుధవారం ఒక బస్సు లోయలోపడిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్థాన్ రాష్ట్రంలోని హబ్ పట్టణంలో బుధవారం రాత్రి 8 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులంతా సింధ్ రాష్ట్రంలోని థాట్టా పట్టణానికి చెందినవారు. వీరంతా బలూచిస్థాన్లోని ఖుజ్దార్ జిల్లాలో ముస్లిం సూఫీ క్షేత్రమైన షా నూరానీ వద్దకు నివాళులర్పించేందుకు వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం కరాచీకి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదంలో గాయపడిన వారిని, మృతదేహాలను కరాచీలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు.