ఐఎఇఎ చీఫ్ వెల్లడి
టోక్యో : జపాన్ అణు విద్యుత్ కేంద్రం ఫుకుషిమా నుంచి విడుదలవుతున్న అణు కలుషిత వ్యర్థజలాలపై మరింత లోతైన పరిశీలన జరపనున్నట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ) చీఫ్ రాఫెల్ గ్రాసీ చెప్పారు. సునామీ కారణంగా దెబ్బ తిన్న ఫుకుషిమా అణు విద్యుత్ కర్మాగారం నుంచి ప్రమాదకరమైన అణు కలుషిత వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జపాన్ చుట్టు పక్కల దేశాల నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో ఐఎఇఎ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాసీ మూడు రోజుల పర్యటన కోసం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అణు వ్యర్థాలపై మరింత లోతైన పరిశీలన జరపాల్సి ఉంటుందన్నారు.
ఫుకుషిమా ఉపద్రవానికి ఈ నెల 11వ తేదీకి 13ఏళ్లు పూర్తయింది. అణు ధార్మికతతో కలుషితమైన జలాలను దాదాపు దశాబ్ద కాలం పాటు ప్రక్షాళన, శుద్ధి కార్యక్రమాలు కొనసాగించిన తర్వాత ఆ జలాలను పెద్ద మొత్తంలో సముద్రంలోకి విడిచిపెడుతోంది. గత నెలలో టెప్కో నాల్గవ విడత అణు కలుషిత వ్యర్థ జలాలను పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదలజేసింది.