వాషింగ్టన్ : యెమెన్లో మరోమారు అమెరికా, బ్రిటన్ సైన్యాలు దాడులకు తెగబడ్డాయి. హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని సోమవారం దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. రెండో రౌండ్లో భాగంగా మానవ సహిత విమానాలు, నౌకలతో ఈ దాడులు జరిగాయని పేర్కొంది. ఈ రెండు దేశాలు ఈ నెల 11న దాడులకు పాల్పడిన సంగతి విదితమే. తాజా దాడులకు ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, నెదర్లాండ్స్ కూడా మద్దతు తెలిపాయి. హౌతి రెబెల్స్ క్షిపణి వ్యవస్థలు, లాంచర్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్లు, ఆయుధ నిల్వల కేంద్రాలను లక్ష్యించి ఈ దాడులకు పాల్పడినట్లు అమెరికా తెలిపింది.