జబాలియా శరణార్థి శిబిరంపై దాడి : 200 మంది మృతి

Nov 20,2023 11:29 #Gaza, #Israel, #Jabalia refugee camp

 

గాజా సిటీ: గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ వరుసగా మూడు రోజులపాటు జరిపిన బాంబు దాడుల్లో 200 మంది చనిపోయారు. శనివారం ఒక్కరోజే రెండు దాడుల్లో 80 మంది చనిపోయారు. వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మతి చెందిన వారిలో 19 మంది చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన 32 మంది ఉన్నారు. ఆరు వారాల యుద్ధంలో 16 లక్షల మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులైన గాజాలోని అతిపెద్ద శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్‌ దాడి చేస్తూనే ఉంది. గాజాలోని అల్‌-ఫఖురా పాఠశాలపై జరిగిన దాడిలో కనీసం 50 మంది మరణించారు. ఇది యుద్ధం ప్రారంభమైనప్పుడు శరణార్థుల కేంద్రంగా మార్చబడిన పాఠశాల. శనివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. అదే సమయంలో, ఇజ్రాయెల్‌ సైన్యం స్వాధీనం చేసుకున్న అల్‌ షిఫా ఆసుపత్రి నుండి ప్రజలను భారీగా తరలిస్తున్నారు. రోగులు, ఆరోగ్య కార్యకర్తలు, శరణార్థులతో సహా 7,000 మందికి పైగా ప్రజలు ఇక్కడ ఉన్నారు. ప్రజలు గుంపులుగా బయటకు వెళ్తున్న దశ్యాలను అంతర్జాతీయ మీడియా శనివారం విడుదల చేసింది. శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో భారీ పేలుడు సంభవించింది.నాలుగో రోజు కూడా ఇజ్రాయెల్‌ సైన్యం ఆసుపత్రిలో మకాం వేసింది. 120 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని, నవజాత శిశువులు ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉన్నారని హమాస్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే, ఇజ్రాయెల్‌ మాత్రం తాము తరలింపు ఉత్తర్వు జారీ చేయలేదని వాదిస్తోంది. ఇజ్రాయెల్‌ సైన్యం హమాస్‌ కేంద్రంగా ఉందని ఆరోపిస్తూ ఆసుపత్రిని పాక్షికంగా కూల్చివేస్తోంది.దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌లోని హమద్‌ పట్టణంలో ఇజ్రాయెల్‌ బాంబు దాడిలో చిన్నారులతో సహా 28 మంది మరణించారు. గాజాలో ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 12,000 కు చేరుకుంది. గాజాలోని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు శనివారం రఫా సరిహద్దు మీదుగా ఒక ట్రక్కు ఇంధనం అందిందని తెలిపాయి.
ఇజ్రాయెల్‌ అల్యూమినియం ప్లాంట్‌పై క్షిపణి దాడి
దక్షిణ లెబనాన్‌లోని ఇజ్రాయెల్‌ అల్యూమినియం ప్లాంట్‌పై క్షిపణి దాడి చేసింది. నబాతిV్‌ా పట్టణంలోని ప్లాంట్‌పై శనివారం రెండుసార్లు దాడి జరిగింది. గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, లెబనీస్‌ సరిహద్దులో సాయుధ సమూహం హిజ్బుల్లాతో పోరాటం తీవ్రంగా ఉంది.
గాయపడిన పాలస్తీనా చిన్నారులు అరబ్‌ ఎమిరేట్స్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారులతో తొలి విమానం యూఏఈకి చేరుకుంది. గాజాలో గాయపడిన 1,000 మంది చిన్నారులకు చికిత్స అందించేందుకు యూఏఈ ముందుకొచ్చింది. దీని ప్రకారం, గాయపడిన పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో సహా 15 మందితో కూడిన మొదటి విమానం అబుదాబికి చేరుకుంది. ఇందులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. దాడిలో కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన పిల్లలు కూడా ఈ బందంలో ఉన్నట్లు సమాచారం.

అది ఓ మృత్యు నిలయం
అల్‌ షిఫా ఆస్పత్రిలో పరిస్థితిపై డబ్ల్యుహెచ్‌ఓ
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్‌ షిఫా ఓ ‘మృత్యు నిలయం’గా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) అభివర్ణించింది. అక్కడి పరిస్థితి చెప్పనలవి కాదని తెలిపింది. డబ్ల్యుహెచ్‌ఓ నేతృత్వంలోని బృందం శనివారం ఆస్పత్రిని సందర్శించింది. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ కేవలం ఓ గంట సేపు మాత్రమే గడిపింది. ఈ బృందంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రజారోగ్య నిపుణులు, అధికారులు, భద్రతా సిబ్బంది సభ్యులుగా ఉన్నారు. ఆస్పత్రిలో స్వచ్ఛమైన నీరు, ఇంధనం, మందులు, ఇతర అత్యవసరాలకు తీవ్ర కొరత ఏర్పడిందని ఈ బృందం వివరించింది. వాస్తవానికి ఓ వైద్య కేంద్రంగా ఇది పనిచేయడం లేదని తెలిపింది.
‘కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. తూటాలు దూసుకొస్తున్నాయి. ఆస్పత్రి ప్రాంగణం సామూహిక శ్మశాన వాటికలా కన్పించింది. అక్కడ 80 మందికి పైగా మృతులకు అంత్యక్రియలు నిర్వహించారని చెప్పారు’ అని డబ్ల్యూహెచ్‌ఓ ఓ ప్రకటనలో వివరించింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం… ఆస్పత్రిలోకి ప్రవేశించే మార్గాలు, ఆస్పత్రి మైదానం మొత్తం వ్యర్థాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా భరించలేని దుర్వాసన వస్తుండడంతో తమ ఆరోగ్యం, భద్రతపై రోగులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరవై ఐదు మంది ఆరోగ్య కార్యకర్తలు, 291 మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిలో 32 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఆస్పత్రిలో మిగిలి ఉన్న రోగులు, వారి బంధువులు, ఆరోగ్య సిబ్బందిని అక్కడ నుండి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే 24-72 గంటల్లో వారందరినీ సురక్షితంగా వేరే ప్రదేశాలకు పంపుతామని, ముఖ్యంగా రోగులను గాజాకు దక్షిణాన ఉన్న ఆస్పత్రుల్లో చేరుస్తామని అధికారులు తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఒ ప్రకటనపై ఇజ్రాయిల్‌ ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఆస్పత్రి ప్రాంగణాన్ని వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయిల్‌ రక్షణ దళాలు హెచ్చరికలు పంపడంతో అల్‌ షిఫా మైదానంలో ఆశ్రయం పొందుతున్న 2,500 మంది బాధితులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆస్పత్రి సమీపంలో భీకర పోరు సాగుతోందని, ఇజ్రాయిల్‌ సైన్యంతో సమన్వయం చేసుకొని తాము ఆస్పత్రిలోకి వెళ్లామని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని, ఆపన్నులకు మానవతా సాయాన్ని అందించాలని ఆ సంస్థ మరోసారి విజ్ఞప్తి చేసింది.

➡️