వాషింగ్టన్ : ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ గ్రూప్ పై ప్రతీకార దాడులు చేపట్టాలని అధ్యక్షుడు బైడెన్ అమెరికా మిలటరీని సోమవారం ఆదేశించారు. ఇరాన్ మిలిటెంట్ గ్రూప్ కతియాబ్ హిజ్బుల్లా, అనుబంధ సమూహాలు వినియోగించే మూడు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఉత్తర ఇరాక్లో జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు గాయపడినట్లు సమాచారం. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో అమెరికా సైనికుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సి) ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ తెలిపారు. ఇరాన్ మిలిటెంట్ గ్రూప్ కతియాబ్ హిజ్బుల్లా, అనుబంధ సమూహాలు ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాయి.
జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఇచ్చిన దాడి సమాచారంతో బైడెన్ ఈ దాడితో అప్రమత్తమయ్యారని, పెంటగాన్, అత్యున్నత అధికారులతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఆ సమయంలో బైడెన్ మేరీలాండ్లోని క్యాంప్ డేవిడ్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గన్నట్లు తెలుస్తోంది. బైడెన్ జాతీయ భద్రతా డిప్యూటీ సలహాదారు జోన్ పైనర్ కూడా అధ్యక్షుడితో ఉన్నట్లు సమాచారం. జేక్ సుల్లివన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్తో సంప్రదింపులు జరిపారు.