లాస్ ఏంజెల్స్ : లాస్ ఏంజెల్స్లోని ఓ నల్లజాతి మహిళ తాను గృహహింసను ఎదుర్కొంటున్నానని ఫిర్యాదు చేసేందుకు డిసెంబర్ 4వ తేదీన అత్యవసర హెల్స్లైన్ నెంబర్ 911కి కాల్ చేసింది. ఆ ఫోన్కాల్కి స్పందించి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు అయితే అక్కడ జరిగిన ఘర్షణ ఫలితంగా ఆమెను పోలీసులు కాల్చి చంపారని పోలీసు అధికారి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం నియాని ఫిన్లేసన్ (27) అనే మహిళ గృహహింస కేసును నివేదించడానికి 911కి డయల్ చేసింది. ఫోన్లో ఆమె పోలీసులకు చెప్పే సమయంలో అరుపులు, శబ్దాలు వినిపించాయి. దీంతో పోలీసులు లాంకాస్టర్లోని ఈస్ట్ అవెన్యూలోని నియాని ఉంటున్న అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు బలవంతంగా తలుపు తెరిచారు. అప్పటికే అక్కడ నియోని తన ప్రియుడుతో ఘర్షణ పడుతోంది. తన తొమ్మిదేళ్ల కూతుర్ని ప్రియుడు తోసేసినందుకు అతన్ని చంపేస్తా అంటూ కత్తితో బెదిరించింది. తన కన్నకూతురి ముందే నియోనిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆమెను ఆసుపత్రికి తరలించేలోపు చనిపోయింది. ఇక ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
కాగా ఈ ఘటనపై నియోని కుమార్తె ఎక్సైయిషా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మా అమ్మ కత్తితో బెదిరించడం వల్లే కాల్పులు జరిపినట్లు పోలీసులు అబద్ధం చెబుతున్నారు. ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్. నాకు ఎప్పుడూ అండగా ఉండేది. మా అమ్మను నేను చాలా మిస్ అవుతున్నాను.’ అని అన్నది. ఇక తన తల్లి చనిపోవడానికి కారణమైన బారుఫ్రెండ్ షెల్టన్ను విచారించాలని తొమ్మిదేళ్ల చిన్నారి చెప్పింది. అయితే పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా ఆమె కుటుంబం చట్టపరమైన దావా వేసింది. దీంతో ముప్పై వేల డాలర్లను తన కుటుంబానికి అందించేందుకు కౌంటీ విభాగం నిధుల సేకరణను ప్రారంభించింది.
గతంలో కూడా షెల్టన్పై నేర అభియోగాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 2020లో షెల్టన్ మైఖెల్ అనే వ్యక్తిని కాల్చి చంపాడు. అతనికి సంకెళ్లు వేయడానికి ప్రయత్నించినప్పుడు మళ్లీ కాల్పులు జరిపేందుకు పోలీసుల వద్ద ఉన్న తుపాకీని పట్టుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.