- హమాస్ విమర్శ
- అల్జజీరా కార్యాలయాల మూసివేత
జెరూసలెం/గాజా : కాల్పుల విరమణపై ఒప్పందం కోసం జరుగుతున్న యత్నాలను నెతన్యాహు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని హమాస్ విమర్శించింది. గాజాలో ఇజ్రాయిల్ ఆక్రమణకు స్వస్తి పలికేలా సమగ్ర కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని హమాస్ నిజాయితీగా కృషి చేస్తోందని, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీయే చెప్పారు. కైరోలో ఇరు పక్షాల మధ్య చర్చలు పునరుద్ధరించాల్సి వుంది, అందుకోసం ప్రతినిధి బృందాన్ని పంపించాల్సి వుంది. రఫా నగరంపై మిలటరీ దాడిని ఇజ్రాయిల్ ప్రారంభించదని అమెరికా గ్యారంటీ ఇవ్వాలని హమాస్ కోరుతోంది. ఒప్పందం కుదురుతుందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా దాడి జరిగి తీరుతుందని నెతన్యాహు చెబుతున్నారు. కాల్పుల విరమణకు నెతన్యాహు అంగీకరించాలని, ఒప్పందంలో భాగంగా గాజాలోని బందీలను విడిపించాలని ఇజ్రాయిల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు కోరుతున్నారు. బందీలను విడుదల చేయాలంటే గాజాలో యుద్ధానికి ఇక స్వస్తి పలకాలని హమాస్ చేస్తున్న డిమాండ్ను నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అల్జజీరా కార్యాలయాల మూసివేతకు ఆదేశం
ఇదిలావుండగా, ఇజ్రాయిల్లో అల్ జజీరా కార్యాలయాలన్నింటినీ మూసివేయాలని నెతన్యాహు ప్రభుత్వం ఆదేశిచంఇంది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని ఇజ్రాయిల్ కమ్యూనికేషన్స్ మంత్రి చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు పెట్టారు. అరబిక్, ఇంగ్లీషు భాషలకు సంబంధించి రెండు కార్యాలయాలను మూసివేస్తారు. టెలిఫోన్లు, కంప్యూటర్లు మినహా మిగిలిన పరకరాలన్నింటినీ జప్తు చేస్తారు. దీనివల్ల చర్చలు ఇబ్బందుల్లో పడతాయని నేషనల్ యూనిటీ పార్టీ వ్యాఖ్యానించింది. అక్టోబరు 7నుండి ఇప్పటివరకు అల్జజీరా జర్నలిస్టులపై 50కి పైగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో జర్నలిస్టులు తమ కుటుంబాలకు కుటుంబాలనే పోగొట్టుకున్నారని జెరూసలేంలో అల్జజీరా బ్యూరో చీఫ్ వాలిడ్ ఒమరీ చెప్పారు. కాగా అల్జజీరా కార్యాలయాలను మూసివేస్తామనడం ఇజ్రాయిల్ ప్రభుత్వం నిరాశా నిస్పృహలతో తీసుకున్న నిర్ణయమని గాజాలోని పాలస్తీనియన్లు వ్యాఖ్యానించారు.