మ్యూనిచ్ : పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్ మాలికితో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ విషయాన్ని జైశంకర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో గాజాలో ప్రస్తుత పరిస్థితిపై తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. ‘పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్ మాలికితో సమావేశం కావడం చాలా సంతోషంగా ఉంది. గాజాలో ప్రస్తుత పరిస్థితిపై అభిప్రాయాలు పంచుకున్నాం’ అని మంత్రి తెలిపారు. సమావేశానికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశారు. మ్యూనిచ్ భద్రతా సదస్సు నేపథ్యంలో జైశంకర్ ప్రస్తుతం జర్మనీలోని మ్యూనిచ్ పట్టణంలో ఉన్న సంగతి తెలిసిందే. శనివారం ఈ సదస్సులో జైశంకర్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ – పాలస్తీనా సమస్య పరిష్కారానికి రెండు దేశాల ఏర్పాటే పరిష్కారమని భారత్ ఎన్నో ఏళ్ల నుంచి చెబుతున్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.