మాలె : మాల్దీవుల నుండి భారత్ తన సైనికులందరినీ ఉపసంహరించుకుంది. మాల్దీవుల్లో ఉన్న భారత సైనికుల చివరి బ్యాచ్ దేశాన్ని వీడినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి హీనా వలీద్ శుక్రవారం ప్రకటించారు. అయితే ఎంతమంది మాల్దీవులను వీడారన్నది స్పష్టం చేయలేదు. సైనికుల సంఖ్య, వివరాలను తర్వాత వెల్లడిస్తామని అన్నారు.
తన దేశం నుండి మే 10లోగా భారత్ తన సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిందిగా మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు డెడ్లైన్ విధించిన సంగతి తెలిసిందే. మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత్లో పర్యటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. గురువారం ఆయన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో భేటీ అయ్యారు.
గతంలో భారత్ బహుమతిగా ఇచ్చిన రెండు హెలికాఫ్టర్లు, డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్లను నిర్వహణపై శిక్షణనిచ్చేందుకు భారత సైన్యం మాల్దీవులకు వెళ్లింది.