- 9మంది మృతి, 14మందికి గాయాలు
గురుగ్రామ్ : హర్యానాలోని నుV్ా జిల్లాలో కుండ్లి-మనేసర్-పాల్వాల్ ఎక్స్ప్రెస్వేలో టూరిస్ట్ బస్సుకు మంటలు అంటుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో పదేళ్ల బాలికతో సహా 9మంది మరణించగా, 14మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. శనివారం తెల్లవారు జామున 2గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో బస్సులో 60మంది ప్రయాణికులు వున్నారు. యుపిలోని మథుర నుండి పంజాబ్లోని హోషియార్పూర్కు బస్సు వెళుతోంది. గాయపడినవారిని వెంటనే నల్హార్ మెడికల్ కాలేజీలో చేర్చగా, వారందరూ ప్రమాదం నుండి బయటపడ్డారని పోలీసులు చెప్పారు. మంటలు చెలరేగిన తర్వాత బస్సు తలుపులు తెరుచుకోలేదని, దాంతో కిటికీల్లో నుండి దూకాల్సి వచ్చిందని గాయపడిన వారిలో ఒకరు మీడియాకు తెలిపారు. బస్సు అంతా పొగతో నిండిపోయిందని, ప్రతి ఒక్కరూ ప్రాణభయంతో పరుగులు తీయడం కనిపించిందని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.