బాండ్లు కావవి ముడుపులు

Mar 25,2024 00:55 #bjp scam, #Electoral Bonds

ముడుపులు చెల్లించుకో, కాంట్రాక్టులు దక్కించుకో
-బిజెపి బాండ్ల స్కాములో మరో కోణం
– అక్రమ రూటులో రూ.3.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు, కాంట్రాక్టులు
– ఎలక్టోరల్‌ బాండ్ల కొనుగోలు చేసిన 41 కంపెనీలూ
కేంద్ర ఏజెన్సీల దాడులు ఎదుర్కొన్నవే
– ఆ కంపెనీల నుంచి బిజెపికి రూ.2,471 కోట్లు అందాయి
– రూ.143 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొన్న మరో 30 డొల్ల కంపెనీలు
– నిఫ్టీ, సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీలు కొనుగోలు చేసిన 81 శాతం ఎలక్టోరల్‌ బాండ్లు బిజెపికే
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కాముగా పేరొందిన ఎలక్టోరల్‌ బాండ్ల డేటా తవ్వే కొద్దీ అవినీతి గుట్టలుగుట్టలుగా బయటకొస్తోంది. ఈ అవినీతి పరంపరలో తాజాగా మరో కోణం వెలుగుచూసింది. బిజెపికి రూ.2,471 కోట్లు బాండ్ల రూపంలో ముడపులు ముట్ట జెప్పిన 41 కంపెనీలు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి), ఆదాయపు పన్ను (ఐటి) వంటి కేంద్ర ప్రభుత్వ ఎజెన్సీల దాడులను ఎదుర్కొన్నవే. ఈ దాడుల తరువాత దాదాపు రూ.1,698 కోట్లు బిజెపికి ఈ కంపెనీలు విరాళంగా ఇచ్చాయి. రాజ్యాంగ విరుద్ధమైన ఎలక్టోరల్‌ బాండ్ల పథకం కింద, కనీసం 30 షెల్‌ (డొల్ల) కంపెనీలు రూ.143 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేశాయి.
ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేసి బిజెపికి విరాళం ఇచ్చిన 33 కంపెనీలు 172 మేజర్‌ కాంట్రాక్టులు, ప్రభుత్వం నుండి ప్రాజెక్ట్‌ అనుమతులు పొందాయి. బిజెపికి రూ.1,751 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్‌ విరాళాలు ఇచ్చినందుకు, వారు మొత్తం రూ.3.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు, కాంట్రాక్టులు పొందారు. పోస్ట్‌పెయిడ్‌ కాంట్రాక్టులు, ప్రాజెక్ట్‌ అనుమతులలో కేంద్రం లేదా బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు రూ.62,000 కోట్లు ఇచ్చాయి. ఆమోదానికి బదులుగా, మూడు నెలల్లోనే ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో పార్టీకి రూ.580 కోట్ల ”ముడుపులు ” లభించాయి.
గత ఏడాది ఆగస్టులో ఐటి శాఖ దాడులు జరిపిన మూడు నెలల్లోనే కల్పతరు గ్రూప్‌ బిజెపికి రూ.5.5 కోట్లు ఇచ్చింది.
2023 నవంబర్‌ 12, 2021 డిసెంబర్‌ 1లో ఐటి, ఈడి దాడులు జరిగిన మూడు నెలల్లో ఫ్యూచర్‌ గేమింగ్‌ బిజెపికి రూ.60 కోట్లు ఇచ్చింది. 2022 నవంబర్‌ 10న ఇడి రైడ్‌ జరిగిన మూడు నెలల్లో అరబిందో ఫార్మా బిజెపికి రూ. 5 కోట్లు ఇచ్చింది.
నిఫ్టీ, సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీలు కొనుగోలు చేసిన 81 శాతం ఎలక్టోరల్‌ బాండ్ల్లు బిజెపికే వెళ్లాయి.
15 నిఫ్టీ లిస్టెడ్‌ కంపెనీలు రూ.646 కోట్లు, ఎనిమిది సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీలు రూ.337 కోట్ల విలువ చేసిన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేశాయి. నిఫ్టీ లిస్టెడ్‌ కంపెనీలు కొనుగోలు చేసిన రూ.646 కోట్లలో ఒక్క బిజెపికే రూ. 521 కోట్లు (81 శాతం) ముట్టాయి.. సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీలు కొనుగోలు చేసిన రూ.337 కోట్లు బిజెపికే అందాయి. . సెన్సెక్స్‌లోని ఎనిమిది కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్‌, అల్ట్రా టెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటిసి, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, సన్‌ ఫార్మా, టెక్‌ మహీంద్రా ఉన్నాయి.ఈ కంపెనీలన్నీ కూడా నిఫ్టీ జాబితాలో ఉన్నాయి. ఇందులో మరో ఏడు డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌, దివీస్‌ లాబరేటరీస్‌, సిప్లా, గ్రాసిమ్‌, హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, యుపిఎల్‌ లిమిటెడ్‌ ఉన్నాయి.
ఎలక్టోరల్‌ బాండ్ల పథకంతో నాలుగు రకాల అవినీతి జరిగిందని, ఎలక్టోరల్‌ బాండ్ల పథకం స్వతంత్ర దేశంలో అతిపెద్ద స్కామ్‌లలో ఒకటి అని సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ పేర్కొన్నారు. ”మొదటిది చందా దో, ధందాలో (విరాళం ఇచ్చి వ్యాపారం చేసుకోండి), రెండోది హఫ్తా-వసూలి (దోపిడీి), మూడోది ది లో రిష్వత్‌ దో (బ్యాగ్‌ కాంట్రాక్ట్‌, లంచం ఇవ్వండి)” అని విమర్శించారు.

➡️