భోపాల్ : మధ్యప్రదేశ్లోని బాణాసంచా ఫ్యాక్టరీలో మంగళవారం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, సుమారు 40 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
హర్డాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగిందని, పేలుడు ధాటికి నర్మదాపురం జిల్లాలోని సియోని మాల్వా ప్రాంతంలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు భయాందోళనలకు గురయ్యారని అన్నారు. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయని జిల్లా కలెక్టర్ రిషిగార్గ్ తెలిపారు. ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని అన్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 150 కార్మికులు ఉన్నారని చెప్పారు.