అగ్నిగుండంలా ఢిల్లీ – 108 డిగ్రీల జ్వరంతో వ్యక్తి మృతి

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ అగ్నిగుండాన్ని తలపిస్తోంది. వడగాల్పులతో మండిపోతోంది. వడదెబ్బ తగిలి ఓ మధ్య వయస్సు వ్యక్తి మృతి చెందాడు. అయితే అతడి శరీర ఉష్ణోగ్రతను చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అతని శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 డిగ్రీలు ఎక్కువగా (108 డిగ్రీలు) ఉండటం గమనార్హం..! సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రి డాక్టర్‌ రాజేశ్‌ శుక్లా వెల్లడించారు.

” బిహార్‌లోని దర్భాంగా పట్టణానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి సోమవారం ఢిల్లీలో వడదెబ్బకు గురయ్యారు. వెంటనే ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయన శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీ ఫారన్‌హీట్‌కు చేరుకోవడం చూసి ఆందోళనకు గురయ్యాం. ఆయనను ఎలాగైనా కాపాడాలని శతథా ప్రయత్నించాం. కానీ శరీరంలో అతివేడి కారణంగా ఆయన మూత్రపిండాలు, కాలేయం విఫలమయ్యాయి. ఇలా వెంటవెంటనే పలు అవయవాలు వైఫల్యం చెందడంతో ఆయన కన్నుమూశారు’ అని డాక్టర్‌ వివరించారు.

➡️