– కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఆ పార్టీ నేతలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఆ పార్టీ నేతలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. పంజాబ్, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో విశేష స్పందన లభించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన నిరాహార దీక్షలో రాజ్యసభ ఎంపి సంజరు సింగ్, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ గోయల్, డిప్యూటీ స్పీకర్ రాఖీ బిల్లా, మంత్రులు అతిషి, గోపాల్ రారు, సౌరబ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ఎంపి సందీప్ పాఠక్, సీనియర్ నేత సోమనాథ్ భారతి పాల్గన్నారు. కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి గోపాల్ రారు మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీని నామరూపాలు లేకుండా చేయడం కోసమే బిజెపి ఈ తరహా కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. అందులో భాగంగానే ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్ట్ చేసిందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆయా ప్రభుత్వాలను కూలదోసేవారిపై పోరాటం ఆరంభమైందని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ గోయల్ అన్నారు. కమలం పార్టీ నేతలు ఆప్ను చీల్చాలని కోరుకుంటున్నా తాము మరింతగా బలపడతామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రియులు అరవింద్ కేజ్రీవాల్కు బాసటగా నిలుస్తున్నారని అన్నారు.
స్వాతంత్య్ర సమర యోధుడు భగత్ సింగ్ స్వగ్రామమైన పంజాబ్లోని కత్కర్ కలాన్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్సింగ్మాన్ దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షకు ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు.
విదేశాల్లో సైతం కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా దీక్షలు చేపట్టారు. బోస్టన్లో హార్వర్డ్ స్క్వేర్, లాస్ ఏంజెల్స్లోని హాలీవుడ్ సైన్, వాషింగ్టన్ డిసిలోని భారత రాయబార కార్యాలయం వెలుపల, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్, టోరంటో, లండన్, మెల్బోర్న్లోనూ నిరాహార దీక్షలు చేపట్టారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సంగతి విదితమే.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/20-4.jpg)