20 గంటలు శ్రమించి.. చిన్నారికి ఊపిరి పోసి..

  • బోరుబావిలో పడ్డ పసివాడిని రక్షించిన సహాయక బలగాలు
  •  కర్ణాటకలోని విజయపురలో ఘటన

బెంగళూరు : కర్ణాటకలోని బోరుబావిలో పడిన ఏడాదిన్నర చిన్నారి కథ సుఖాంతమైంది. సహాయక బలగాలు 20 గంటలు శ్రమించి ఆ పసివాడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. విజయపుర జిల్లా ఇండి తాలూకా లచ్యాణా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన సాక్షిత్‌ మజగొండన బుధవారం మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి తన ఇంటి సమీపంలోని తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయాడు. బావిలో నుంచి చిన్నారి ఏడుపు శబ్దాలు విన్న స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పారు. సమాచారమందుకున్న ఎస్‌డిఆర్‌ఎఫ్‌, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం 6:30 గంటలకు ఈ రెస్క్యూ ఆపరేషన్‌ మొదలైంది. మొదట బోరుబావిలోకి కెమెరాను పంపగా.. 16 అడుగుల లోతులో చిన్నారి కాలు కదులుతూ కన్పించింది. వెంటనే పైప్‌లైన్‌ సాయంతో ఆక్సిజన్‌ను లోపలికి పంపించారు. ఆ తర్వాత బావి చుట్టూ తవ్వారు. దాదాపు 18 గంటల తర్వాత బాలుడి చిక్కుకొన్న ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు.
చిన్నారి రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోవడంతో బయటకు తీసుకురావడం కష్టమైంది. మరో రెండు గంటలు శ్రమించి బండరాళ్లను తొలిచి చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నంతసేపు ఆ పసివాడు ఏడుస్తున్న దృశ్యాలు అక్కడి వారి హృదయాలను కలిచివేశాయి. చిన్నారి మృత్యుంజయుడిగా బయటపడటంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి అవసరమైన చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

➡️