బెంగళూరు : ఎయిరిండియా విమానం ఇంజిన్లో మంటలు చెలరేగడంతో బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండయ్యింది. ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. శనివారం రాత్రి బెంగళూరు నుంచి కొచ్చికి బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు చెలరేగడంతో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.
మంటలను గుర్తించిన సిబ్బంది…
బెంగళూరు విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే సిబ్బంది మంటలను గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారమిచ్చారు. దీంతో ఎయిర్పోర్టులో అత్యవసర ఏర్పాట్లు చేశారు. రాత్రి 11:12 గంటల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండయ్యింది. మంటల్ని చూసిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఎలాంటి ప్రమాదం లేదని భరోసా ఇస్తూనే సిబ్బంది ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. ఎట్టకేలకు రన్వేపై క్రాష్ ల్యాండ్ అయిన విమానం నుంచి ప్రయాణికులు ఓపెన్ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చారు. ఈ క్రమంలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. అప్పటికే ఫైరింజన్లు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. విమానం ఆగిన వెంటనే మంటలను ఆర్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా ప్రయాణికులను రన్వే నుంచి ఎయిర్పోర్టు లోపలికి తీసుకెళ్లారు.
దర్యాప్తు చేస్తాం : ఎయిరిండియా ఎక్స్ప్రెస్
జరిగిన ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విచారం వ్యక్తం చేసింది. నియంత్రణా సంస్థలతో కలిసి దర్యాప్తు చేస్తామని తెలిపింది. మంటలు చెలరేగడానికి గల కారణాలను తెలసుకుంటామని పేర్కొంది. శుక్రవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎయిరిండియా విమానంలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. ఏసీలో మంటలు రావటంతో వెంటనే ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయ్యింది.