లక్నో : ఇది నిరుపయోగ బడ్జెట్ అని, ప్రజల కోసం కాదని సమాజ్ వాది పార్టీ (ఎస్పి) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అఖిలేష్యాదవ్ పై విధంగా స్పందించారు. ఏ బడ్జెట్ అయినా అభివృద్ధి కోసం కాకపోతే, ఏ అభివృద్ధి అయినా ప్రజల కోసం కాకపోతే, అది పనికిరానిదని అన్నారు. దశాబ్దం పాటు ప్రజావ్యతిరేక బడ్జెట్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వంగా బిజెపి రికార్డ్ సృష్టించిందని ఎద్దేవా చేశారు. ఈ రికార్డ్ ఎప్పటికీ బ్రేక్ కాదని, ఎందుకంటే సానుకూల ప్రభుత్వం రావడానికి ఇప్పుడు సమయం ఆసన్నమైందని ఎక్స్లో పేర్కొన్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కూడా స్పందించారు. అసలు బడ్జెట్ జులైలో వస్తుందని అన్నారు. ఆ బడ్జెట్తో ప్రజలు ప్రయోజనం పొందుతారని, పర్యాటకం పెరుగుతుందని, పరిశ్రమలు కూడా పెరుగుతాయని, దేశం పురోగమిస్తుందని అన్నారు.