న్యూఢిల్లీ : రాజకీయనేతగా మారిన గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ కుమారుడు ఉమర్ అన్సారీకి సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ హృషికేష్ రారు, పి.కె. మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టుకు హాజరు కావాలని ఉమర్ను కోరారు.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో ఉమర్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బిఎస్పి) మౌ సదర్ స్థానానికి పోటీ చేస్తున్న అబ్బాస్ అన్సారీ, ఉమర్ అన్సారీ సహా 150 మంది గుర్తుతెలియని వ్యక్తులపై అదే ఏడాది మార్చి 4న కొట్వాలి పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
జనవరి 25న, ఈ కేసులో అరెస్టునుండి సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. గతేడాది డిసెంబర్ 19న అలహాబాద్ హైకోర్టు అన్సారీ ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. వాస్తవాలు, పరిస్థితులను పరిశీలిస్తే.. నేరం వెలుగులోకి వస్తుందని పేర్కొంది. జైలు శిక్ష అనుభవిస్తున్న ముక్తార్ అన్సారీ ఉత్తరప్రదేశ్లోని ఆస్పత్రిలో మార్చి 28న గుండెపోటుతో మరణించారు.