బీహార్‌లో భారత్‌ జోడో న్యాయ్ యాత్ర – నేడు భారీ ర్యాలీ, మహాకూటమి నాయకుల హాజరు

కిషన్‌గంజ్‌ : కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో న్యారు యాత్ర సోమవారం బీహార్‌లో ప్రవేశించింది. ఉదయం 8 గంటలకు పశ్చిమబెంగాల్‌లోని సోనాపూర్‌ నుండి ప్రారంభమైన యాత్ర ఉదయం 11 గంటలకు బీహార్‌ సరిహద్దులోని కిషన్‌గంజ్‌ చేరుకుంది. ఈ సందర్భంగా కిషన్‌గంజ్‌ జిల్లాల్లో జరిగిన ర్యాలీల్లో రాహుల్‌ మాట్లాడుతూ బిజెపి, ప్రధాని మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. నితీష్‌కుమార్‌ ఇండియా వేదిక నుంచి బయటకు వెళ్లడంపై రాహుల్‌ స్పందించలేదు. మోడీ ప్రభుత్వానిది ‘విద్వేష భావజాలం’ అయితే, తమది ప్రేమ అనే భావజాలం అని అన్నారు. కొంతమంది ఎంపిక చేసిన బిలియనీర్లకు దేశంలో ప్రజలందరి డబ్బును మోడీ ప్రభుత్వం దోచిపెడుతుందని విమర్శించారు. కేంద్రంలో 90 మంది ఐఎఎస్‌ అధికారులు ఉంటే వారిలో ముగ్గురు మాత్రమే ఒబిసిలని అన్నారు. దేశ జనాభాలో 50 శాతం ఉన్న ఒబిసిలకు ఉద్యోగ, విద్యా అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులగణన దేశానికి ఎక్స్‌రే లాంటిదని, అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన నిర్వహిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. దేశంలో పేదలు అన్యాయానికి గురవుతున్నారని, వారికోసమే ఈ యాత్ర అని చెప్పారు. మంగళవారం బీహార్‌లో కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీని నిర్వహించనుంది. ఈ ర్యాలీలో మహాకూటమికి చెందిన నాయకులు హాజరుకానున్నారు.ఆ సిఎంల సర్టిఫికెట్‌ అవసరం లేదు : కాంగ్రెస్‌అసోం, బీహార్‌ ముఖ్యమంత్రుల నుండి తమ పార్టీకి సర్టిఫికెట్‌ అవసరం లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ అన్నారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘భారత్‌ జోడో న్యారు యాత్రకు అసోం ముఖ్యమంత్రి నుండి చాలా ప్రచారం లభించింది. నితీష్‌ కుమార్‌ నమ్మకద్రోహం తర్వాత బీహార్‌లోని కిషన్‌గంజ్‌ ప్రజలు రాహుల్‌ యాత్రకు ఎంతో ఉత్సాహంతో స్వాగతం పలికారు. అసోం సిఎం నుండి, బీహార్‌ సిఎం నుండి మాకు సర్టిఫికెట్‌ అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు.

➡️