- అవకాశవాద నితీష్ సారధ్యంలో ఎన్డిఎ కూటమి
- తేజస్వి కెప్టెన్గా ఇండియా బ్లాక్
- సిపిఎం, సిపిఐ చెరొక చోట పోటీ
- సిపిఐ(ఎంఎల్) 3 స్థానాల్లో
ప్రజాశక్తి – పాట్నా : జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే బీహార్లో ఇండియా ఫోరం, ఎన్డిఎ మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. 40 స్థానాలున్న బీహార్లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో నాలుగు, తరువాత నాలుగు విడతల్లో ఐదేసి స్థానాలు, చివరి రెండు విడతల్లో ఎనిమిదేసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి తమ స్థానాలను నిలబెట్టుకోవాలని ఎన్డిఎ కూటమి ప్రయత్నిస్తుండగా, ఈతడవ బీహార్లో విజయంతో ఎన్డిఎ కూటమిని మట్టి కరిపించేందుకు ఇండియా ఫోరం శ్రమిస్తోంది. రాష్ట్రంలో మొత్తం ఓట్లు 7,64,33,329 కాగా పురుషులు4,00,29,136, మహిళలు: 3,64,01,903 ట్రాన్స్ జండర్ ఓట్లు 2,290.
పొత్తులు, కూటములు
బీహార్లో దాదాపుగా పాత కూటమి సర్దుబాట్లే కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో బిజెపి, జెడియు, లోక్ జనశక్తి పార్టీలతో ఎన్డిఎ కూటమి 39 సీట్లను గెలుచుకుంది. బిజెపి 17 సీట్లలో పోటీ చేసి అన్నీ గెలుచుకుంది. జెడియు 17 సీట్లకు 16 చోట్ల, ఎల్జేపి ఆరింటికి ఆరూ కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడి తదితర పార్టీల మహాకూటమి ఓటమి చెందింది. కాంగ్రెస్ 9 చోట్ల పోటీ చేసి ఒక సీటు గెల్చుకోగా, ఆర్జెడి 19 స్థానాల్లో పోటీ చేసి అన్నింటిలో ఓడిపోయింది. ఈసారి ఎన్డిఎ కూటమిలో బిజెపి 17, జెడియు 16, చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్టేపి 5, జితన్ రామ్ మాంఝికి చెందిన హిందుస్తాన్ ఆవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. ఇండియా ఫోరంలో ఆర్జేడి 26, కాంగ్రెస్ 9, సిపిఐ(ఎంఎల్) 3, సిపిఎం 1, సిపిఐ 1 పోటీ చేస్తున్నాయి. అయితే ఆర్జేడి తమ 26 సీట్లలో మూడింటిని మాజీ మంత్రి ముకేశ్ సాహ్ని సారథ్యంలోని వికాసిల్ ఇన్సాన్ పార్టీ (విఐపి)కి కేటాయించింది.
బిజెపి సీట్లకు గండి
దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న నితీష్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎన్డిఎ సీట్లకు గండి పడనుంది. రాష్ట్రంలో కులగణన చేపట్టడాన్ని నితీష్ సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. అది తమ ఘనతేనని కాంగ్రెస్, ఆర్జెడి కౌంటర్ ఇస్తున్నాయి. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆ హామీ ఇస్తున్న విషయాన్ని, మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది. బిజెపి రామ మందిరాన్నే నమ్ముకుంది. ఎన్నికల వేళ వెన్నుపోటు పొడిచిన నితీష్కు గుణపాఠం నేర్పాలని ఇండియా ఫోరం పట్టుదలగా ఉంది. ఆయనది పచ్చి అవకాశవాదమంటూ కాంగ్రెస్, ఆర్జేడి విమర్శిస్తున్నాయి.
కులాలు చుట్టూనే…
బీహార్లో దశాబ్దాలుగా కులాల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. నితీష్ చేపట్టిన కులగణన మరోసారి రిజర్వేషన్ల అంశాన్ని చర్చకు పెట్టింది. రాష్ట్రంలో 94 లక్షల కుటుంబాలు (34.13 శాతం) నెలకు రూ.6,000 సంపాదన కూడా లేక పేదరికంలో మగ్గుతున్నారని కులగణనలో వెల్లడైంది. రాష్ట్రంలో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాల్సిందేనని నితీష్ పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 19.65 శాతం ఎస్సిలు, 1.68 శాతం ఎస్టీలున్నారు. వారిలో ఏకంగా 42.7 శాతం మంది నిరుపేదలని కులగణనలో తేలింది. 27.13 శాతం ఒబిసిలున్నారు. దాదాపు 17.7 శాతం మంది ముస్లింలున్నారు.
నిరుద్యోగం, ధరలు పెరుగుదలే ప్రధాన సమస్యలు
బీహార్లో నిరుద్యోగం, ధరల పెరుగుదలే ప్రధాన ఎన్నికల అంశాలుగా ఉన్నాయి. మోడీ హయాంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, కార్పొరేట్ దోపిడీ తదితరాలను ప్రచారారస్తాలుగా ప్రతిపక్ష ఇండియా ఫోరం మలచుకుంటున్నాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఎన్నికల ఎజెండా అని ఆర్జేడి నేత తేజశ్వీ యాదవ్ పేర్కొన్నారు.
ఫిరాయింపుల నితీష్
బీహార్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కప్పగంతులకు మారుపేరుగా నిలిచారు. ఏదో ఒక పార్టీ పొత్తుతో 15 ఏళ్లుగా సిఎం పీఠాన్ని అంటిపెట్టుకున్నారు. ఒకసారి బిజెపితో, మరొకసారి ఆర్జెడితో ఇలా కూటములు మారుస్తూ పబ్బంగడుపుకుంటూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డిఎ కూటమికి గుడ్ బై చెప్పి బయటకు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడి, సమాజ్ వాదీ, జెడిఎస్, కాంగ్రెస్ మహా కూటమిగా పోటీ చేశాయి. ఆర్జేడి అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా నితీష్ సిఎం పదవి దక్కించుకున్నారు. రెండేళ్లు తిరిగేసరికి మహాకూటమికి రాంరాం చెప్పి మళ్లీ బిజెపితో జట్టుకట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డిఎ కూటమితో సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. ఆ తరువాత 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డిఎ భాగస్వామిగా పోటీ చేసి సిఎం పీఠమెక్కారు. బిజెపి ఎక్కువ సీట్లు గెలిచినా నితీష్ మళ్లీ సిఎం పదవి దక్కించుకున్నారు. తిరిగి రెండేళ్లలోనే ఆయన మళ్లీ ప్లేటు ఫిరాయించారు. ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాల ఇండియా ఫోరంలో చేరారు. ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశించారు. కాని అది జరగకపోవడంతో ఇండియా ఫోరం నుంచి బయటకెళ్లి, ఎన్డిఎ కూటమిలో చేరారు. ఇలా కప్పగెంతులేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఉన్నారని నితిష్ కుమార్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాశ్వాన్ ఫ్యామిలీలో కమలం చిచ్చు
బీహార్లో పాశ్వాన్ కుటుంబానికి పేరుంది. నాలుగైదు దశాబ్దాల పాటు రామ్ విలాస్ పాశ్వాన్ జాతీయ రాజకీయల్లో ఉన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా, ఆయన కేంద్ర మంత్రిగా ఉండేవారు. అలాంటి కుటుంబంలో బిజెపి చిచ్చు పెట్టింది. అబ్బారు-బాబారు మధ్య గొడవ పెట్టింది. ఎల్జేపి వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తరువాత ఆయన వారసత్వం కోసం కుమారుడు చిరాగ్, సోదరుడు పశుపతి పరాస్ తీవ్రంగా తలపడ్డారు. చివరికి పార్టీని పరాస్ చేజిక్కించుకున్నారు. చిరాగ్ కు ఎల్టేపి (రాం విలాస్), పశుపతికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎపి) పేర్లను ఎన్నికల సంఘం కేటాయించింది. పశుపతి కేంద్ర మంత్రిగా ఉండేవారు. పశుపతి పార్టీకే బిజెపి మద్దతు ఇచ్చింది. చిరాగ్ ను రామ్ విలాస్ పాశ్వాన్ బంగ్లాను కూడా ఖాళీ చేయమని కేంద్రం నోటీసు ఇచ్చింది. మళ్లీ ఏమైందో ఏమోగాని పశుపతి పార్టీకి బిజెపి ఒక్క సీటూ ఇవ్వకపోవడంతో ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు. సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించారు. రాగ్ పార్టీకి బిజెపి ఐదు సీట్లు ఇచ్చింది.