న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అమలుచేయబూనుకున్న పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ప్రమాదకరం అని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ బుధవారం మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ చట్టం అమలు చేయడం వల్ల స్వాతంత్య్రానంతరం జరిగిన దానికంటే ఇప్పుడు ఎక్కువ వలసలు జరుగుతాయని కేజ్రీవాల్ అన్నారు. సిఎఎ వల్ల శాంతిభద్రతలు కుప్పకూలుతాయని, దొంగతనాలు, దోపిడీలు అత్యాచారాలు పెరుగుతాయని ఢిల్లీ సిఎం పేర్కొన్నారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ వంటి దేశాల నుండి భారత్కు వలస వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం ఇస్తామని కేంద్రం సిఎఎ చట్టం చేసింది. భారత్ చాలా పేద దేశం. మనం ఇతర దేశాల నుండి వచ్చే వలసదారుల కోసం తలుపు తెరిచి వారిని ఆహ్వానిస్తే.. వారిని ఎక్కడ స్థిరంగా ఉంచుతాము? అని ఈ సందర్భంగా కేజ్రీవాల్ కేంద్రాన్ని ప్రశ్నించారు.