కోల్కతా : పశ్చిమ బెంగాల్ నుండి పోటీచేస్తున్న వామపక్షాల అభ్యర్ధులు ప్రధానంగా ఎన్నికల బాండ్లు, అవినీతి, మతోన్మాదం వంటి అంశాలతోపాటూ స్థానికంగా సంచలనం కలిగించిన సందేశ్ఖలి అంశాలపై ఉధృతంగా ప్రచారం సాగిస్తున్నారు. డమ్డమ్ ప్రాంతంలో జూట్ మిల్లు కార్మికుల ప్రయోజనార్ధం సిపిఎం అభ్యర్ధి గెలుపొందడం కీలకమని ఆ ప్రాంత జూట్ మిల్లు కార్మికులు భావిస్తున్నారు. సిపిఎం నేత సుజన్ చక్రవర్తి డమ్డమ్ నుండి పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంత కార్మికుల దుస్థితి గురించి బాగా అర్ధం చేసుకున్న చక్రవర్తి ఈసారి తన గెలుపునకు అవకాశాలు బాగుంటాయని ఆశిస్తున్నారు. తృణమూల్ అసమర్ధ పాలనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఆ పార్టీ అభ్యర్ధి సౌగత్రారు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారని సుజన్ చక్రవర్తి అన్నారు. ఈసారి కఠినంగా పోటీ వుండనుందని ఆయన ఇప్పటికే వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.
జాదవ్పూర్ నుండి వామపక్ష అభ్యర్ధిగా బరిలోకి దిగిన సృజన్ భట్టాచార్య, ముర్షిదాబాద్ నుండి మహ్మద్ సలీంలు కూడా స్థానిక సమస్యలతోపాటూ సందేశ్ఖలిపై ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని కోల్కతాలోనూ సిపిఎం అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.