- బెంగళూరు ఫిల్మ్ ఫెస్ట్ నుంచి రైతుల నిరసనపై డాక్యుమెంటరీ నిషేధం
- ప్రదర్శితం కాని ‘కిసాన్ సత్యాగ్రహ’
న్యూఢిల్లీ : రైతుల పట్ల అనుసరించిన అమానవీయ వైఖరి ప్రపంచానికి తెలియకుండా మోడీ సర్కారు అధికార బలాన్ని వినియోగిస్తోంది. 2020-21 రైతుల నిరసనపై రూపొందించిన ‘కిసాన్ సత్యాగ్రహ’ డాక్యుమెంటరీని బెంగుళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (బిఐఎఫ్ఎఫ్)లో ప్రదర్శించకుండా నిషేధించింది. ”సున్నితమైనది” అనే కారణంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆ డాక్యుమెంటరీకి అనుమతి నిరాకరించింది. దీంతో ‘కిసాన్ సత్యాగ్రహ’ ప్రదర్శన ఆగిపోయింది.కన్నడ దర్శకుడు కేసరి హరవు దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ.. మోడీ సర్కారు రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయటానికి రైతులు దాదాపు ఒక సంవత్సరం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళనలను వివరిస్తుంది. డాక్యుమెంటరీని బిఐఎఫ్ఎఫ్ 15వ ఎడిషన్లో ప్రదర్శించా ల్సి ఉన్నది. ”ప్రదర్శింపబడే అన్ని సినిమాలకు ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ అనుమతినిస్తుంది. అయితే, మంత్రిత్వ శాఖ ‘కిసాన్ సత్యాగ్రహం’కి గ్రీన్ సిగల్ ఇవ్వలేదు… డాక్యుమెంట రీలో చిత్రీకరించిన విషయం సున్నితమైన అంశం కాబట్టి దీనిని ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించకుండా నిలిపివేయాలని కేంద్ర అధికారులు మాకు చెప్పారు. సూచనలను అనుస రించి, మేము ‘కిసాన్ సత్యాగ్రహ’ ప్రదర్శనను ఉపసంహ రించు కున్నాము. లేకుంటే శుక్రవారమే స్క్రీనింగ్కు షెడ్యూ ల్ చేసి ఉండాల్సింది” అని కర్ణాటక చలనచిత్ర అకాడమీ రిజిస్ట్రార్ జి. హిమంత్ రాజు తెలిపినట్టు ఒక వార్త సంస్థ పేర్కొన్నది. ఇప్పటి వరకు రైతులపై 86 నిమిషాల నిడివి గల డాక్యుమెంటరీ నాలుగు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలతో సహా కొన్ని ఫోరమ్లలో ఆఫ్లైన్లో ప్రదర్శించబడింది. కిసాన్ సత్యాగ్రహం వైట్ యునికార్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో ఉత్తమ భారతీయ డాక్యుమెంటరీ అవార్డును గెలుచుకున్నది. అనటోలియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో ఫైనలిస్ట్గా నిలిచింది.