విశ్వాస పరీక్షలో నెగ్గిన చంపయీ సోరెన్‌

Feb 6,2024 07:48 #Champai Soren, #Jharkhand CM
  • అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : హేమంత్‌ సోరేన్‌

రాంచి : ముఖ్యమంత్రి చంపయీ సోరెన్‌ నేతృత్వంలోని జార్ఖండ్‌ ముక్తి మోర్చా సంకీర్ణ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గింది. 81మంది సభ్యులు గల అసెంబ్లీలో విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 47మంది ఎంఎల్‌ఎలు ఓటు వేయగా, 29మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. స్వతంత్ర ఎంఎల్‌ఎ సరయు రారు గైర్హాజరయ్యారు. ఓటింగ్‌ సమయంలో 77మంది ఎంఎల్‌ఎలు సభలో వున్నారు. పాలక సంకీర్ణంలో జెఎంఎం, కాంగ్రెస్‌, ఆర్‌జెడి వుండగా, వెలుపలి నుండి సిపిఐ ఎంఎల్‌ (ఎల్‌) సభ్యుడు మద్దతు ఇస్తున్నారు. వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో బిజెపికి చెందిన 26మంది, ముగ్గురు ఎజెఎస్‌యు పార్టీకి చెందినవారు ఉన్నారు.మనీ లాండరింగ్‌ కేసులో గత వారం ఇడి విచారించడంతో ముఖ్యమంత్రిగా వున్న హేమంత్‌ సోరేన్‌ను జనవరి 31న పదవికి రాజీనామా చేశారు. వెంటనే ఇడి ఆయనను అరెస్టు చేసింది. జెఎంఎం శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంపయీ సోరేన్‌ ముఖ్యమంత్రిగా ఈ నెల 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. సభలో బలాన్ని నిరూపించుకునేందుకు చంపయీ సోరేన్‌కు 10 రోజులు గడువిచ్చారు. ఇడి కస్టడీలో వున్న హేమంత్‌ సోరేన్‌కు ప్రత్యేక పిఎంఎల్‌ఎ కోర్టు అనుమతినివ్వడంతో ఆయన బలపరీక్షలో పాల్గొన్నారు.

నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : హేమంత్‌ సోరేన్‌

అసెంబ్లీలో హేమంత్‌ సోరేన్‌ మాట్లాడుతూ 8.5 ఎకరాల ప్లాట్‌కు సంబంధించి తనపై కేసు పెట్టారని, ఆ ప్లాట్‌ తన పేరు మీద ఉందని రుజువు చూపాలని బిజెపిని సవాల్‌ చేశారు. అలా చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఆదివాసీల కన్నీళ్లు వారికి పట్టవని, తాను ఏడవనని, సరైన సమయంలో వారి ప్రతి కుట్రకు సమాధానం చెబుతానని చెప్పారు. కోట్లు దోచుకుని విదేశాలకు పారిపోయిన వారిని వారు ఏమీ చేయలేరని, గిరిజనులను, అమాయకులను లక్ష్యంగా చేసుకోవడమే వారు చేయగలరని చెప్పారు. గిరిజనులు న్యాయమూర్తులుగా, ఐపిఎస్‌లుగా, ఐఎఎస్‌లుగా, నాయకులుగా ఎదగడం వారికి ఇష్టం లేదని అన్నారు. కుతంత్రాలతో విజయం సాధిస్తామని వారు భావిస్తున్నారని, కానీ జార్ఖండ్‌, గిరిజనులు, దళితులు త్యాగాలు చేసిన రాష్ట్రమని గుర్తు చేశారు.

హేమంత్‌ భార్యను కలిసిన రాహుల్‌గాంధీ

హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కలిశారు. రాష్ట్రంలో భారత్‌ జోడో న్యారు యాత్ర సందర్భంగా ఆమెతో సమావేశమయ్యారు. జెఎంఎం- కాంగ్రెస్‌ కూటమి బలపరీక్షలో నెగ్గిన తర్వాత రాహుల్‌గాంధీ ఆమెను కలిసినట్లు కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

 

➡️