ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపిని గద్దె దించేందుకు దూకుడు పెంచాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) నిర్ణయించింది. సిడబ్ల్యుసి సమావేశం గురువారం ఎఐసిసి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించారు. ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఇది మూడో సిడబ్ల్యుసి సమావేశం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికలపై చర్చించారు. బిజెపిని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై వ్యూహాలు, ప్రతి వ్యూహాలపై చర్చించారు. ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలు, బిజెపిని గద్దె దించడానికి ఇండియా ఫోరంతో కలిసి పనిచేయడం, దేశ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. లోక్సభ ఎన్నికల ప్రచార వ్యూహాలు, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో విడత జనవరిలో తూర్పు నుంచి పడమర వరకు చేపట్టాలనే ప్రతిపాదనపై కూడా చర్చించినట్లు తెలస్తోంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి గుజరాత్ వరకు చేసే జోడో యాత్ర ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇండియా ఫోరంలో భాగంగా కీలక రాష్ట్రాల్లో సీట్ల పంపకాల అంశాలపైనా సిడబ్ల్యూసి చర్చించింది. పార్టీ 139వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్పూర్లో మెగా ర్యాలీతో జరుపుకోవడానికి ముందు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ సిడబ్ల్యూసి అనేది కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణాయక కమిటీ అనే విషయం తెలిసిందే. గురువారం జరిగిన సిడబ్ల్యుసి సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, అధిర్ రంజన్ చౌదరి, దిగ్విజరు సింగ్, మీరా కుమారి, అజరు మాకెన్, మానిక్కం ఠాగూర్, రఘువీరారెడ్డి, పల్లం రాజు, కొప్పుల రాజు, టి సుబ్బిరామిరెడ్డి, సిడబ్ల్యుసి సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు.