కొల్కతా : స్వతంత్ర సంగ్రామ యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా సిపిఎం ఘన నివాళులర్పించింది. నేతాజీ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ ఉద్దేశ్యం ‘ఐక్యత, విశ్వాసం, త్యాగం’ అని, నేటికి ఇది ఎంతో అవసరమని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. కొల్కతాలోని రాజా సుబోధ్ మల్లిక్ కూడలిలో సిపిఎం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ నేతృత్వంతో నేతాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. లెఫ్ట్ఫ్రంట్ ఛైర్మన్ బిమన్ బసు, పొలిట్బ్యూరో సభ్యులు సూర్యకాంత మిశ్రా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![cpm remeber subhash chandrabose](https://prajasakti.com/wp-content/uploads/2024/01/cpm-remeber-subhash-chandrabose.jpg)