న్యూఢిల్లీ : ఓట్ల కోసం ఈ ర్యాలీ చేపట్టడం లేదనిఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భార్య సునీత పేర్కొన్నారు. తన భర్తను మోడీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, అయితే కేజ్రీవాల్ ఎక్కువ కాలం జైలులో ఉండరని న్యాయం గెలిచి తీరుతుందని ఆమె పేర్కొన్నారు. తన భర్త దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడి లాంటి వాడని అన్నారు.
కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో ఇండియా ఫోరం భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ భారీ ర్యాలీలో కూటమిలోని 29 పార్టీలు పాల్గొననున్నాయి. ఈ ర్యాలీలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భార్య సునీత ఆయన సందేశాన్ని చదివి వినిపించారు. ”నేను ఓట్లు అడిగేందుకు ఇక్కడికి రాలేదు. నేను జైలులో ఉన్నాను. ఆలోచించుకునేందుకు చాలా సమయం ఇచ్చింది. ఈ రోజు భారత మాత బాధలో ఉంది” అని సునీత కేజ్రీవాల్ సందేశాన్ని చదివి వినిపించారు. ‘‘ నవ భారతాన్ని నిర్మిద్దాం. ప్రతి వ్యక్తికి, ఉపాధి , మంచి విద్య , అందరికీ అందుబాటులో ఆరోగ్య భద్రత కల్పిస్తామని అన్నారు. ద్వేషం లేని దేశం, న్యాయం అందరికీ సమానంగా అమలయ్యే దేశాన్నీ నిర్మించాలి’’ అని పేర్కొన్నారు.
తన ఇద్దరు సోదరీ మణులు కల్పన, సునీతలకు మద్దతుగా నిలిచేందుకు ఇక్కడి వచ్చానని, ఇది ప్రచార ర్యాలీ కాదని శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్థాకరే పేర్కొన్నారు. నియంతృత్వ బిజెపి ప్రభుత్వం వారి భర్తలను అక్రమంగా జైలులో పెట్టిందని, వారికి దేశం యావత్తు మద్దతుగా నిలుస్తుందని చెప్పేందుకు ఇక్కడికి వచ్చానని అన్నారు. ఇడి, ఐటి, సిబిఐ బిజెపి భాగస్వామ్యులని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు సమయం ఆసన్నమైందని అన్నారు. అధికార పార్టీ వాషింగ్ మెషీన్ వంటిదని, వారి పార్టీలో చేరిన తర్వాత అవినీతి పరులు కూడా క్లీన్గా మారతారని ఎద్దేవా చేశారు. రైతులు కూడా ర్యాలీలో పాల్గొనాలని భావించారని, అయితే వారికి బిజెపి ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని అన్నారు. రైతులను తీవ్రవాదులుగా అభివర్ణించే ప్రభుత్వం పోవాలని, కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు.
నియంతృత్వ, మతతత్వ బిజెపి పార్టీ విధానాలను ఎండకట్టేందుకు, అరవింద్ కేజ్రీవాల్, హెమంత్ సోరెన్ అరెస్ట్కు వ్యతిరేకంగా రాంలీలా మైదానంలో మహా ర్యాలీలో ప్రజలు. నేతలు పాల్గంటున్నారని సిపిఎం నేత బృందాకరత్ పేర్కొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉపా చట్టాన్ని ఇడి, సిబిఐ దర్యాప్తు సంస్థలను బిజెపి దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం సమర్థమంతమైనది కాదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.
రాజ్యాంగం దాడికి గురవుతోందని కాంగెస్ నేత సుప్రియా శ్రీనతే అన్నారు. రాంలీలా మైదనంలోని మెగా ర్యాలీ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ రాజ్యాంగం దాడికి గురవుతోంది. దేశం మొత్తం రాజ్యాంగ రక్షణకు కలిసికట్టుగా ముందుకువెళ్తోంది. ఇదే విషయాన్ని విషయాన్ని తెలియజేయటానికి ర్యాలీకి హాజరవుతున్నా’ అని అన్నారు.
ఢిల్లీ ప్రజల కోసమే కేజ్రీవాల్ ఆందోళన..
రాంలీలా మైదనం వద్దకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారని ఢిల్లీ మంత్రి ఆతిషీ అన్నారు. ఆమె మీడియా మాట్లాడుతూ.. సిఎం కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల జీవితాలను మార్చారని వారికి తెలుసు. ఆయన అరెస్ట్ అయ్యాక కూడా ఢిల్లీ ప్రజల కోసం ఆందోళన పడుతున్నారు’ అని మంత్రి పేర్కొన్నారు.