ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు వాదనలు ముగించింది. ఈ పిటిషన్పై తీర్పును మే రెండుకు రిజర్వు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో అరెస్టయిన కవిత ఈ నెల 15న మొత్తం 664 పేజీలతో ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఇదే లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఇడి అరెస్టును సవాల్ చేస్తూ కవిత బెయిల్ కోరారు. ఈ రెండు పిటిషన్లను సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. ఇరువైపులా వాదనలు విన్న స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా… ఈ పిటిషన్పై వాదనలు ముగిస్తున్నట్లు స్పష్టం చేశారు. మే రెండున తుది ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. మరోవైపు ఢిల్లీ మద్యం విధానంలోని ఇడి కేసులోనూ కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.ఇడి, సిబిఐ కేసులో కవితకు విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో మంగళవారం ఆమెను ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఇడి కేసులో ఈ నెల 9న కోర్టు 14 రోజులు కస్టడీ పొడిగించగా… సిబిఐ కేసులో ఈ నెల 15న ఎనిమిది రోజుల కస్టడీ విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/Kavitha-1.jpg)