న్యూఢిల్లీ : హమాస్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించే ప్రశ్నతో కూడిన ఏ పేపర్పైనా తాను సంతకం చేయలేదని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి శనివారం స్పష్టం చేశారు. భారత్ హమాస్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించే యోచనలో ఉందా? అనే స్టార్ గుర్తు లేని ప్రశ్నతో కూడిన పేపర్పై లేఖి సమాధానం ఇచ్చినట్టుగా సోషల్మీడియలో వార్తలొచ్చాయి. ఈ వార్తలపై ప్రస్తుతం విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్న లేఖి స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆమె పోస్టు చేశారు. ‘ఈ అంశంపై విదేశాంగ మంత్రి స్పష్టత ఇస్తారు. ఇందులో సాంకేతిక లోపం ఉన్నట్లు తెలుస్తోంది. మీకు తప్పుడు సమాచారం అందింది. ఈ ప్రశ్నతో ఉన్న ఏ పేపర్పై నేను సంతకం చేయలేదు.’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టుకి విదేశాంగ శాఖ ఎస్. జైశంకర్, ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. ఇక లేఖి స్పష్టతపై శివసేన (యుబిటి) ఎంపి ప్రియాంక చతుర్వేది స్పందించారు. ‘ఆమె సంతకం ఫోర్జరి జరిగి ఉంటుందని ఆమె అనుకుంటున్నారా? ఇలా జరిగితే తీవ్ర స్థాయి నిబంధనల ఉల్లంఘనే. దీనిపై ఆమె నుంచి స్పష్టత వస్తే మేం సంతోషిస్తాం’ అని అన్నారు. కాగా, హమాస్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించే ప్రతిపాదనలో ఉందా? అనే దానిపై కాంగ్రెస్ ఎంపి కుంబకుడి సుధాకరన్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో హమాస్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్ రాయబారి భారత్ను అభ్యర్థించారు. అయితే ఇజ్రాయెల్ రాయబారి అభ్యర్థనపై భారత్ ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హమాస్, ఇజ్రాయెల్ పోరు వల్ల పరిస్థితులు మరింత దిగజారుతుండడంపై ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను కేవలం శాంతి యుత మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ పిలుపునిస్తోంది.