అనంత్‌నాగ్‌లో అజాద్‌పై మెహబూబా పోటీ

– కాశ్మీర్‌లో 3 స్థానాల్లో పిడిపి పోటీ
– జమ్ములో రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌కు మద్దతు
శ్రీనగర్‌ : పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీ లోక్‌సభ ఎన్నికల్లో అనంత్‌నాగ్‌ ా రాజౌరీ స్థానం నుంచి డిపిఎపి అధ్యక్షులు గులాం నబీ ఆజాద్‌పై పోటీ చేయనున్నారు. ఈ స్థానంతో సహా జమ్ముకాశ్మీర్‌లోని మూడు స్థానాలకు పిడిపి తమ అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ యువ విభాగం అధ్యక్షులు వాహీద్‌ పర్రా శ్రీనగర్‌ నుంచి రాజ్యసభ మాజీ సభ్యులు మీర్‌ ఫయాజ్‌ బారాముల్లా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు పిడిపి పార్లమెంటరీ బోర్డు ఛీఫ్‌ సర్తాజ్‌ మండి ఆదివారం చెప్పారు. అయితే కాశ్మీర్‌లోయలో మీకు కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందా అని ప్రశ్నించగా..తాము జాతీయ పార్టీ నుంచి క్విడ్‌ ప్రోకో తరహాలో మద్దతు ఆశించడం లేదని, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే పోరాటంలో భాగంగానే జమ్ములో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామని పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు. కాగా జమ్ము ప్రాంతంలోని ఉధంపుర్‌, జమ్ము లోక్‌స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా పిడిపి ప్రచారం చేపట్టనున్నట్లు తెలిపారు. అనంత్‌నాగ్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి గుజ్జార్‌ నేత మియాన్‌ అల్తాఫ్‌ పోటీ చేస్తున్న సంగతి విదితమే. కాగా అప్నీ పార్టీ నుంచి జఫార్‌ ఇక్బాల్‌ మన్‌హాస్‌ బరిలో ఉన్నారు. బిజెపి ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సివుంది.

➡️