ముజఫర్పుర్: ఇండియా వేదిక నేతలు పాకిస్థాన్ అణు సామర్థ్యాన్ని చూసి భయపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. బీహార్లోని హజీపుర్, ముజఫర్పుర్, సరణ్లో వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ”ఇడి వంటి దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా వారు ఎందుకు గొంతు చించుకుంటున్నారో నేను చెప్తాను. కాంగ్రెస్ హయాంలో ఇడి ఓ స్కూల్ బ్యాగులో దాచిన రూ.35లక్షలను మాత్రమే స్వాధీనం చేసుకోగలిగింది. అదే మేం అధికారంలో వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు దాదాపు రూ.2,200 కోట్ల అవినీతి సొమ్మును బట్టబయలు చేసింది. ఆ నోట్ల గుట్టలను తరలించాలంటే కనీసం 70 చిన్న ట్రక్కులు కావాలి. రాజకీయ నాయకులపై జరిపిన సోదాల్లో బయటపడిన డబ్బంతా దేశంలోని పేద ప్రజలదే” అని అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్, ఆర్జెడి చెబుతున్నాయని చెప్పారు. వారసత్వ పన్ను తీసుకురావాలని అంటున్నాయని, తాను బతికున్నంత వరకు అలా జరగనివ్వనని చెప్పారు.