పాట్నా : బీహార్లో రాజకీయాలు వేడెక్కాయి. జెడి(యు), ఆర్జెడిల మధ్య విభేదాలు తీవ్రమైన క్రమంలో బీహార్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు తిరిగి ఎన్డిఎ కూటమికి చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఈ ఊహాగానాలు వాస్తవమనేలా.. ఈ నెల 28న జెడి(యు)-బిజెపి భాగస్వామ్యంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2020 ఒప్పందం ప్ర కారం.. డిప్యూటీ సిఎంలుగా బిజెపి నేతలకు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. బిజెపి సీనియర్ సీనియర్ నేత సుశీల్ మోడీ డిప్యూటీ సిఎం బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో.. అసెంబ్లీ రద్దు కాదని, పోలింగ్ ఉండదని ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలపైనే దృష్టి సారించారని, దీంతో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పాట్నాలో రాష్ట్రంలోని తమ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలతో బిజెపి అత్యవసర సమాచారాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపాయి.
మూసివేసిన తలుపులు తెరుచుకుంటాయని, రాజకీయాలు అవకాశాల గేమ్ వంటివని సుశీల్ మోడీ వ్యాఖ్యానించడం గమనార్హం. సంజరు ఝా, అశోక్ చౌదరి సహా మరి కొందరు నేతలు బిజెపితో పొత్తుపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్జెడితో పొత్తును తెంచుకున్నందున వచ్చే లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయవచ్చు లేదా ఇతర కూటమిలోనైనా చేరవచ్చు అంటూ హిందుస్థాన్ అవామ్ మోర్చా అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ పేర్కొన్నారు.