న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాలు ఆరోరోజు సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. నీట్పై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై బిజెపి నేత అనురాగ్ ఠాకూర్ చర్చను ప్రారంభించడంతో ప్రతిపక్ష సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు.
ప్రతిపక్ష నేతగా ఎంపికైన రాహుల్ గాంధీకి బిజెపి ఎంపి అభినందనలు తెలిపారు. ఇన్నాళ్లూ రాహుల్ గాంధీ బాధ్యత లేకుండా అధికారంలో కొనసాగారని, ఇప్పుడు ఆయనకు అధికారంతో పాటు బాధ్యత కూడా వహించాల్సి వుంటుందని అన్నారు. ఇప్పుడు మూడోసారి ప్రధాని అయిన మోడీకి పరీక్ష కాదని, ప్రతిపక్షాలకు పరీక్ష అని అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. పార్లమెంటును ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో దార్శనికత, దిశానిర్దేశం లేదని అన్నారు. పేదలు, దళితులు, మైనారిటీల గురించి ప్రస్తావించలేదని చెప్పారు.